పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఉద్యోగంలో అతను చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. ఓ సామాజిక పథకం. గతంలో పెన్షన్ సక్రమంగా వచ్చేది కాదు. అప్పట్లో నేతల ఇష్టాఇష్టాలపై పెన్షన్లు ఆధారపడి ఉండేవి. ఫలితంగా జీతాలపై ఆధారపడిన కుటుంబాలు విరమణ చేసిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడేవి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్ 1982 డిసెంబర్ 17న ఇచ్చిన తీర్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం ద్వారా రాజ్యాంగ భద్రత కలిగింది. స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ధర్మాసనం తీర్పు తర్వాత పెన్షన్ సక్రమంగా ఇస్తున్నారు. దీంతో డిసెంబర్ 17ను జాతీయ పెన్సనర్ల దినోత్సవంగా ప్రతి ఏడాది జరుపుకొంటున్నారు.
జగిత్యాల, డిసెంబర్ 16: సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించి, విరమణ పొంది విశ్రాంతి తీసుకునే సమయంలో కుటుంబ సభ్యు ల మధ్య సమాజంలో గౌరవం పొందడానికి, జీవించడానికి ప్రధాన కారణం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్. మామూలుగా జీవించే సగటు వారికన్నా పెన్షన్దారుల ఆయుష్షు మరో పదేళ్లకు పైగా ఉంటుందని పలువురు సైకాలజిస్టులు, మా నసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వాళ్లకు ప్రభుత్వం ప్రతి నెలా ఠంచనుగా పెన్షన్ ఇవ్వడం, ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య సాయం, ఆర్థిక ఇబ్బందులు లేకపోవడం, ప్రశాంతంగా జీవనంతో ఆయుష్షు ప్రమాణం పెరుగుతున్నది. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 17న జాతీయ పెన్షన్దారుల దినోత్సవం పెన్షనర్ల అసోసియేషన్లు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
సుప్రీం కోర్టు తీర్పుతో..
1982 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొం దిన ప్రభుత్వ ఉద్యోగులకు రివిజన్ ఆఫ్ పెన్షన్ వర్తించేలా.. అంతకన్నా ముందు పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ వర్తించదని కేంద్ర ప్రభు త్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ పెన్షనర్ల పక్షాన ధర్మ స్వరూప్ నకారా అనే వ్యక్తి సుప్రీం కోర్టులో కేసు వేయగా పెన్షన్ అనేది ఉద్యోగుల హకుగా జస్టీస్ చంద్రచూడ్ 1982 డిసెంబర్ 17న ఇచ్చిన తీర్పుతో కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వ ఉద్యోగుల పెన్షన్కు చట్ట భద్రత కలిగింది. ఈ తీర్పు వచ్చిన రోజును దేశ వ్యాప్తంగా పెన్షనర్లు, పెన్షనర్ల అసోసియేషన్లు జాతీయ పింఛనుదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు ప్రయోజనా లు కల్పించారు. విరమణ రోజునే వారిని సంబంధిత అధికారి ప్రభుత్వ వాహనంలో ఇంటివద్ద దింపి, ప్రయోజనాలను అందేలా చూస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పెన్షనర్లు..
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో (కరీంనగర్, జగిత్యా ల, పెద్దపల్లి, సిరిసిల్లా రాజన్న)లో 28వేల మంది పెన్షనర్లున్నారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 8వేలు, కరీంనగర్లో 9వేలు, పెద్దపల్లిలో 6వేలు, సిరిసిల్ల జిల్లాలో 5వేల మంది పెన్షనర్లున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలకు కలి పి రూ.85కోట్లకు పైగా పెన్షన్ పొందుతున్నారు. విశ్రాంతి తీసుకునే సమయంలోనూ మరొకరికి భారం కాకుండా నెల నెలా పింఛన్ రూపంలో డబ్బులు అందుతుండడంతో ఉల్లాసంగా జీవనం గడుపుతున్నారు.
అసోసియేషన్ అండ
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి 2013లో హైదరాబాద్లో ఏర్పాటైన తెలంగాణ పెన్షనర్స్ సెంట్ర ల్ అసోసియేషన్కు కరీంనగర్ జిల్లా కేంద్రం వాసి గాజుల నర్సయ్య రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా హరి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ జిల్లా కో ఆపరేటివ్ అధికారి బొల్లం విజయ్, కోశాధికారిగా రిటైర్డ్ మారెట్ కార్యాలయ అధికారి గౌరిశెట్టి విశ్వనాథం ఉన్నారు. జిల్లాలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ ఓ వైపు పెన్షనర్ల సంఘం నిర్వహిస్తునే, మరోవైపు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తోటి పెన్షన్ దారులతో చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఏటా జాతీయ పెన్షనర్ దినోత్సవం సందర్భంగా 50 మంది వరకు విశిష్ట పెన్షనర్లకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకె రవి శంకర్, జడ్పీ చైర్పర్సన్ వసంత చేతుల మీదుగా సన్మానిస్తున్నారు.
ఆదాయపు పన్ను రద్దుకు ఉద్యమం..
విరమణ ఉద్యోగులకు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే గౌరవ భృతి పెన్షన్. అలాంటి పెన్షన్పై ఆదాయపు పన్ను రద్దు చేయాలని గత నాలుగేండ్లుగా జిల్లాలో తెలంగాణ పెన్షనర్స్ ఆధ్వర్యంలో వివిధ రీతుల్లో ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో మూడేండ్లుగా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్నారు. ప్రధాని, ఆర్థిక మంత్రికి పోస్టుకార్డులు పంపుతున్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేక పోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్మన్లతో మరోసారి ప్రధానికి పోస్టుకార్డులు పంపించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 లో బడ్జెట్లో నైనా పెన్షనర్స్కు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలపై రాజీలేని పోరాటం..
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ ఇచ్చింది. 70 ఏండ్లకే క్వాంటం పెన్షన్, గ్రాట్యుటీ రూ.16 లక్షలకు మంజూరు చేయడం హర్షణీయం. కార్పొరేట్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలని, ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పించాలి.
– హరి అశోక్ కుమార్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
రాయితీలు కల్పించాలి..
సీనియర్ సీటిజన్స్, పెన్షనర్స్ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు రాయితీలు కల్పించాలి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో 50 శాతం రాయితీ కల్పించాలి. ఆరోగ్య కా ర్డుల ద్వారా అన్ని కార్పొరేట్ దవాఖానల్లో నగదుర హిత వైద్య సేవలు అందించాలి. ఆదాయపు పన్ను నుంచి పెన్షనర్స్ను మినహాయించాలి.
– గౌరిశెట్టి విశ్వనాథం, జిల్లా కోశాధికారి, తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్, జగిత్యాల
పెన్షనర్లను గౌరవించాలి..
30 ఏండ్లపాటు ప్రజలకు అహర్నిశలు సేవలందించిన పెన్షనర్స్కు సమాజంలో తగిన గుర్తింపు నివ్వాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీసు స్టేషన్లలో తగిన గౌరవం ఇచ్చి సమస్యలను సత్వరమే పరిషరించాలి. పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలకు టీ యాప్ సౌకర్యం కల్పించి పలు ఇబ్బందులు తప్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– బొల్లం విజయ్, జిల్లా కార్యదర్శి, పెన్షనర్ల అసోసియేషన్