గోదావరిఖని, ఏప్రిల్ 10: సింగరేణి కార్మికుడి బిడ్డగా.. ఒకప్పటి కార్మికుడిగా తనను ఆదరించి అవకాశం ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణిలో పోయిన కారుణ్య ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని కొనియాడారు. సింగరేణి జీడీకే-1వ గనిలో ఓటు అభ్యర్థించారు. సింగరేణి కార్మికులకు సంబంధించి కొన్ని జఠిలమైన సమస్యలు ఉన్నాయని, తనను దీవిస్తే పరిషారానికి కృషి చేస్తానని చెప్పారు.
ఇన్కం టాక్స్ మినహాయింపుతోపాటు సొంతింటి కల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రామగుండం ప్రాంతంలో పొల్యూషన్తో ప్రజలు అనేక ఇబ్బందులను పడుతున్నారని, నివారణ చర్యలు చేపడతామన్నారు. ఇప్పటివరకు సింగరేణిలో 15వేల ఉద్యోగ అవకాశాలను కల్పించి ఎంతోమంది కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని, ఎంతోమంది యువతకు ఉద్యోగాలు కల్పించారని ప్రశంసించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకుడు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు.