ఓదెల, జూలై 18 : కాంగ్రెస్ నాయకులు రైతులను వంచించేలా పూటకో మాట మాట్లాడుతున్నారని, వాళ్లను నమ్మితే మళ్లీ కష్టాలు పడాల్సిందేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మూడు పంటలకు ఉచితంగా కరెంట్, నీళ్లిచ్చే కేసీఆర్ కావాలా..? మూడు గంటలే కరంట్ ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా? రైతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మోసపూరిత, మాయమాటలతో వంచించేందుకు గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం కొలనూర్, సుల్తానాబాద్ మండలం సుద్దాల, కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి రైతు వేదికల్లో ‘మేలుకో.. రైతన్న’ సమావేశాలకు ఆయన హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడ్డారని, కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని, పిండిబస్తాలు, విత్తనాల బస్తాల కోసం చెప్పులు లైన్లలో పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని అనేక రైతు సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. ఉచితంగా 24గంటలు కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని వివరించారు. గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పిస్తామని చెప్పారు. పేదల కోసం పింఛన్లు, కల్యాణలక్ష్మి, కుల వృత్తులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే చీకటి రోజులు తప్పవని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కావటి రాజుయాదవ్, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, ఆకుల మహేందర్, గోపు నారాయణరెడ్డి, సర్పంచ్లు కర్క మల్లారెడ్డి, గుండేటి మధు, నాయకులు బండారి ఐలయ్య యాదవ్, పాకాల సంపత్ రెడ్డి, ఢిల్లీ శంకర్, అమ్ముల భిక్షపతియాదవ్, పోలపెల్లి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.