పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మన్యూనత భావనను పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టుదలతో సాగి తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలని సూచించారు. పెద్దపల్లిలోని అమర్చంద్ కల్యాణ మండపంలో శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. నెలనెలా 3016 పింఛన్తో పాటు పలు రకాల సహాయ యంత్ర పరికరాలను అందిస్తున్నారని చెప్పారు. ఎందరికో ట్రైసైకిళ్లను పంపిణీ చేశారన్నారు. అవసరమున్న వారందరికీ అందజేస్తామని, సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి మున్పిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో దివ్యాంగులే అతి శక్తిమంతులన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం జిల్లావ్యాప్తంగా పలుశాఖల్లో పనిచేస్తున్న దివ్యాంగులైన అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్, సీడీపీవోలు కవిత, పద్మశ్రీ, స్వరూప, పుష్పలత, బాల రక్షక్భవన్ కో ఆర్డినేటర్ సుగుణ, సూపరింటెండెంట్ రాజయ్య పాల్గొన్నారు.