వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే లక్ష్యంగా జల యజ్ఞం చేపట్టిన రాష్ట్ర సర్కారు, అందుబాటులో ఉన్న జలవనరుల ద్వారా చివరి మడినీ తడుపుతున్నది. అందులో భాగంగా మంత్రి ఈశ్వర్ చొరవతో ధర్మారం మండలం సాయంపేటలో కుమ్మరోళ్ల మాటు, సవట కాల్వ మాటు నిర్మాణం మొదలైంది. మరోవైపు పైడిచింతలపల్లి తాళ్లకుంట విస్తరణకు నీటిపారుదల శాఖ రంగం సిద్ధం చేయగా, ఇవన్నీ పూర్తయితే 140 ఎకరాలు సస్యశ్యామలం కాబోతున్నది.
ధర్మారం, జూన్ 27: నంది రిజర్వాయర్ మత్తడి నీరు వెళ్లేందుకు సాయంపేట శివారు నుంచి గోపాల్రావుపేట శివారు దాకా ఇది వరకు ఉన్న పాత వాగును విస్తరించి వరద కాల్వను 2018లో తవ్వారు. ఈ కాలువలోకి ఒక మార్గం లో రిజర్వాయర్ మత్తడి నుంచి, మరో మార్గంలో నంది రిజర్వాయర్ తూము నుంచి నీరు వచ్చి చేరుతున్నది. అయితే కాలువ లోతుగా ఉండడం, సమీప పొలాలు ఎత్తు ప్రాంతంలో ఉండడం వల్ల సాగు నీరు పొలాలకు అందని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో వరద కాల్వకు అనుబంధంగా మాట్లు నిర్మిస్తే పొలాలకు పుష్కలంగా నీరందుతుందని సర్పంచ్ చెనెల్లి సాయికుమార్ చేసిన వినతి మేరకు మంత్రి ఈశ్వర్ స్పందించారు. కుమ్మరోళ్ల మాటు నిర్మాణానికి 36.55 లక్షలు, సవట కాల్వ మాటు నిర్మాణానికి 30.90 లక్షలు మంజూరు చేయించి, ఈ నెల 16న పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఈ క్రమంలో 40 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో సవట కాల్వ మాటు నిర్మాణం చకచకా జరుగుతున్నది. వరద కాల్వపై 28 మీటర్ల పొడవు, 2.4 మీటర్ల ఎత్తుతో 1.00 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్టీ)సామర్థ్యంతో నిర్మిస్తుండగా, పనులు చివరి దశకు చేరాయి. కాగా, ఇది పూర్తయిన తర్వాత కుమ్మరోళ్ల మాటు నిర్మిస్తామని, ఇవి రెండూ పూర్తయితే మొత్తం 80 ఎకరాలకు నీరందుతుందని అధికారులు చెబుతున్నారు.
త్వరలో తాళ్లకుంట విస్తరణకు శంకుస్థాపన
తాళ్లకుంట గ్రామ శివారులో గుట్టల మధ్య తాళ్లకుంట ఉంది. అయితే నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో వానకాలంలో నీరు వృథాగా పోయేది. అయితే కొన్నేళ్ల క్రితం ఉపాధి హామీ పథకం కింద చిన్న కట్టను నిర్మించినప్పటికీ కట్ట జాలు (సీపేజీ) ద్వారా నీరు బయటకు వెళ్లిపోతున్నది. ఈ క్రమంలో కుంటను విస్తరించి, కట్టను బలోపేతం చేయాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి మంత్రి ఈశ్వర్కు విన్నవించగా, ఆయన స్పందించారు. ప్రభుత్వం నుంచి రూ.30 లక్షలు మంజూరు చేయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నిధులతో తాళ్లకుంటలో 3.00 ఎంసీఎఫ్టీ సామర్థ్యంతో నీరు నిల్వ ఉండేలా పూడిక మట్టిని తొలగించి మరింత లోతు చేసి, కట్టను బలోపేతం చేచేస్తారు. ఇది పూర్తయితే సుమారు 60 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుందని, విస్తరణ పనులకు పది రోజుల్లోనే మంత్రి కొప్పుల చేతులమీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ డీఈఈ రమేశ్ తెలిపారు. నీరందించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.