పెద్దపల్లి : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ పిల్లల భాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ స్పష్టం చేసారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. తల్లితండ్రుల పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. వృద్ధాప్యంలో తల్లితండ్రులను బాగా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలో తల్లితండ్రుల, వయోవృద్ధుల పోషణ, సంక్షేమం చట్టం ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులకు కావాల్సిన కనీస అవసరాలను పిల్లలు తీర్చాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం నేరమవుతుంద న్నారు.
వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 14567 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని, ఉదయం 7 నుంచి 9 గుల వరకు నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని తెలిపారు. అనంతరం వయోవృద్ధులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.ప్రమోద్ కుమార్, జిల్లా వయోవృద్ధుల కమిటీ మెంబర్ దాసరి చంద్రమౌళి, వయోవృద్ధుల అసోసియేషన్ అధ్యక్షులు పీటీ స్వామి, జీవన్ రాజు పాల్గొన్నారు.