సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కీలకసూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చోరీలు, ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరి పాటించాలన్నారు.
ఊరికి వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసే ముందు తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఇళ్లలో, ఇంటి పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? రికార్డింగ్లో ఏమైనా సమప్యలు ఉన్నాయా? నైట్ విజన్ సక్రమంగా ఉందా అనే అంశాలను పరిశీలించుకోవాలన్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం వల్ల ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు నిందితులను తొందరగా గుర్తించవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే మొబైల్ ఫోన్ యాప్ ద్వారా లైవ్ ఫుటేజీ చెక్ చేసుకునేవిధంగా కూడా సీసీ కెమెరాలను సెట్ చేసుకోవాలన్నారు.
అలాగే, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లినప్పుడు పక్కింటి వారికి, నమ్మకస్తులకు చెప్పి వెళ్లాలని అన్నారు. రాత్రి సమయాల్లో ఇంటి వెలుపల లైట్లు వెలిగేలా టైమర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇల్లు ఖాళీగా ఉందనే అనుమానం కలగకుండా ఉంటుందని వివరించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని,లేదా డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలని పోలీస్ కమిషనర్ ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పౌరుడు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు