పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 16 : పశు సంవర్థక శాఖ పనితీరును బలోపేతం చేస్తూనే, మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతూ పశుసంపదను పెంచేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో గురువారం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ప్రచార పోస్టర్ లను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు.
పెద్దపల్లి నియోజకవర్గం అంతా వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నందున ఇక్కడ పశుసంపద కూడా అధికంగానే ఉందని, ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ పనితీరును మెరుగు పరుస్తూ పశుసంపదను పెంచే దిశగా చర్యలు చేపట్టాలని, మూగ జీవాల ఆరోగ్యంపై పశుసంవర్థక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను చేసి పెడుతానని అన్నారు.
సంబంధిత శాఖ మంత్రి కూడా తన ఆప్తుడని గుర్తు చేస్తూ అందుకు తగ్గట్లుగా అధికారులు పని చేసుకుంటు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్దక శాఖ అధికారులు, రాగినేడు పశువైద్యాధికారి అఖిల్ రాజ్, నాయకులు ఎనగందుల ప్రదీప్, గిర్నేని సంపత్ రావు, ఎనగందుల నారాయణ, ముత్యాల నరేష్, మందల సత్యనారాయణ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్ పలువురు అధికారులు, గోపాల మిత్రలు పాల్గొన్నారు.