తల్లీబిడ్డల క్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే తో కలిసి రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.
మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వార్డుల్లో కలియతిరిగి అందుతున్న వైద్య సేవలపై బాలింతలను అడిగి తెలుసుకున్నరు. ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద ఎత్తున వస్తున్న పేషెంట్లకు అందిస్తున్న సేవలపై డాక్టర్లతో మాట్లాడి తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో గణనీయంగా ప్రసవాల సంఖ్య పెంచామని, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఉత్తమ సేవలను ప్రజలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని, అత్యవసరమైతేనే సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకోవాలని మంత్రి సూచించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సేవల పట్ల ఇక్కడి బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ పిలుపుమేరకు జిల్లాలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేక మంది మహనీయులు ప్రాణాలు లెక్కచేయకుండా వీరోచిత పోరాటం చేశారని, ఆ పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం లభించిందని మంత్రి తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుల గొప్పతనం ప్రస్తుత తరంలోని యువతకు తెలియజేసే విధంగా దేశ స్వాతంత్రం పోరాటంలో కీలక పాత్ర పోషించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, వైద్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.