కోల్ సిటీ, ఫిబ్రవరి 28: ప్రముఖ ఇంద్రజాలికులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను(Magic Raja) మరో అవార్డు వరించింది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అవార్డులు, సన్మానాలు,సత్కారాలు అందుకున్న మేజిక్ రాజా ఖాతాలో మరో అవార్డు చేరింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇంద్రజాలికునిగా, కవిగా, వ్యాఖ్యాతగా, నటుడిగా, వెంట్రిలాక్విస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ కనబరుస్తూ.. ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందించినందుకుగాను అతిథులు మేజిక్ రాజాను గజమాలతో ఘనంగా సన్మానించి, పీసీ సర్కార్ (సీనియర్) మెమోరియల్ అవార్డును అందజేశారు.
ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికులు పిసి సర్కార్ (సీనియర్) జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆర్కే వండర్ వరల్డ్, తెలంగాణ మేజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించిన వరల్డ్ మెజీషియన్స్ డే వేడుకలలో..హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఇంద్రజాలికులు బీవీ పట్టాభిరాం, మేజిక్ స్టార్ బోస్, సీవీ రమణ, మర్రి రమేష్, స్టిక్ మనోహర్, నాగేశ్వర్ రావు, జీ.రఘుబాబు, డా. రమ్యశ్రీ, ఆంజనేయులు, కళ్యాణ్, ఫణిమాధవ్ కస్తూరి తదితరులు మేజిక్ రాజాను గజమాలతో ఘనంగా సన్మానించి అవార్డ్ ను అందజేశారు.
కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలువురు ప్రతిభావంతులు, సీనియర్ ఇంద్రజాలికులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. గోదావరిఖనికి చెందిన మేజిక్ రాజాకు చోటుదక్కడం విశేషం. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ భారతీయ ఇంద్రజాలాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలిపిన పీసీ సర్కార్ (సీనియర్) పేరిట అవార్డును అందుకోవడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. కాగా రాజా అవార్డును అందుకోవడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్, స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, నియర్ అండ్ డియర్, రామగుండం ఏరియా యూ ట్యూబర్స్ అసోసియేషన్, గోదావరి సరిగమలు సంస్థల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.