పెద్దపల్లి : మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నిర్మూలించి మాదక ద్రవ్య రహిత కమిషనరేట్ గా రామగుండాన్ని తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ను 5ఎస్ మోడల్గా ఆధునీకరించారు. ఈ పోలీస్ స్టేషన్ను సీపీ ప్రారంభించారు.
అలాగే గంజాయి నియంత్రణ కోసం ముద్రించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వాడకం వల్ల యువత బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతుందన్నారు. వీటి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు గంజాయి వాడకం వల్ల జరిగే నష్టాల తోపాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమంలో డీసీపీ పులిగిల్ల రవీందర్, ఏసీపీ పీ. సారంగపాణి, కెషోరాం ప్లాంట్ హెడ్ రాజేష్ గార్గ్, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఎలు మహేందర్, రాజేష్ ల తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.