జూలపల్లి, జూన్ 27 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో వర్షం దంచి కొట్టింది. శనివారం రాత్రి దాదాపు గంట సేపు ఉరుములు మెరుపులతో భారీ వాన కురిసింది. నెల రోజుల నుంచి ముఖం చాటేసిన వరుణుడు కరుణించటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాల రాకతో మరిన్ని వానలు పడే అవకాశం ఉండడంతో మండలంలో మండలం వ్యాప్తంగా సాగు పనులు జోరందుకోనున్నాయి.
నైరుతి రుతుపవనాల ఆలస్యంతో చినుకు పడేదెప్పుడు? అని ఆకాశంకేసి చూస్తున్న రైతన్నలను వరుణుడు కరుణించాడు. జూలపల్లి మండలంలో ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులకు తీపికబురు చెబుతూ భారీ వాన కురిసింది. వానాకాలం నేపథ్యంలో పలువురు పొలాల్లో వరి నార్లు పోసుకొని సిద్ధమయ్యారు.
కొంతమంది రైతులు పత్తి విత్తనాలు వేసుకుని వర్షాల కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో రైతుల నుంచి సంతోషం వ్యక్తం అవుతుంది. వాన కారణంగా ఓ వైపు ఎండ తీవ్రతతో ఉక్కపోత భరించలేకపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. మరో వైపు లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో కొందరు ఇబ్బందులు పడ్డారు.