కాల్వశ్రీరాంపూర్,జనవరి 24: రైతులు ఆరుతడిపంటల్లో భాగంగా ఆయిల్పామ్ సాగుపై దృష్టిపెట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పెగడపల్లి లో పత్తి ప్రతాప్రెడ్డి పంట చేన్లో పట్టు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సోమవారం 2.20 ఎకరాల్లో 1420 ఆయిల్పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే హాజరై ఆయిల్పామ్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంటమార్పిడి చేస్తేనే రైతుకు లాభం జరుగుతుందని వివరించారు. పత్తి, మిరప, వరి పంటలు సాగు చేస్తే ఎక్కువ పెట్టుబడితో పాటు, చీడపీడల వల్ల రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయన్నారు. కేంద్రం వైఖరితోనే వరికి గిట్టుబాటు ధర లభించడంలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పెద్దపల్లి నియోజక వర్గంలో పత్తి ప్రతాప్రెడ్డి మొట్టమొదటి సారి ఆయిల్పామ్ సాగుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. 30-40 సంవత్సరాల వరకు ఈ మొక్కలు ఫలసాయం ఇస్తాయన్నారు. చీడపీడలు రాకుండా చూసుకుంటే మంచి దిగుబడి వస్తుందన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.36వేల సబ్సిడీని ఇస్తున్నదని వివరించారు.
ఎకరాకు సుమారు రూ.1.50లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. నీరు నిల్వ ఉండని,ఎర్ర, దుబ్బ నేలలో ఈ పంట సాగుకు అనుకూలమన్నారు. ప్రతాప్రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇతర రైతులు ఆయిల్పామ్ సాగు చేయాలని కోరారు. ఉద్యానవన శాఖ రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహించాలని ఆదేశించారు. అనంతరం ప్రతాప్రెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ అరెల్లి సుజాతా రమేశ్, ఎంపీటీసీ సుముఖం నిర్మలామల్లారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ కొట్టె సుజాతా రవీందర్, వైస్ చైర్మన్ బూసి సదాశివరెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నిదానపురం దేవయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్కుమార్, ఉద్యానవన శాఖ అధికారులు జగన్మోహన్రెడ్డి, జ్యోతి ఉన్నారు.