Doctor | ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 25: ఆరేండ్ల కింద వైద్యురాలు ఓ మహిళకు డెలివరీ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయి కుట్లు వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఆరేండ్ల కిందట గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వచ్చింది. ప్రసవ సమయంలో వైద్యురాలు కత్తెరను కడుపులోనే మరిచిపోయింది. ఇటీవల సదరు మహిళ కడుపు నొప్పితో బాధపడుతున్నది.
ఈ క్రమంలో హైదరాబాద్కు వెళ్లి స్కానింగ్ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్నట్టు బహిర్గతమైంది. దీంతో బాధితురాలు గోదావరిఖనికి వచ్చి వైద్యురాలిని నిలదీసింది. కడుపులో కత్తెరను తీసేందుకయ్యే ఖర్చు భరిస్తామని వైద్యురాలు తెలపడంతో బాధిత కుటుంబం అంగీకరించినట్టు తెలిసింది.