కోల్ సిటీ, ఆగస్టు 7: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగరంలోని ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ గదులను శుక్రవారం రామగుండం మున్సిపల్ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేయడం కలకలం రేపింది. ఇటీవల రోడ్ల వెడల్పులో భాగంగా ఎల్బీనగర్ సెంటర్ లో గల దుకాణాలను కూల్చివేశారు. ఆ పక్కనే గల సింగరేణి షాపులు నిర్మించుకున్నందుకు అవకాశం కల్పిస్తామని ప్రజా ప్రతినిధులు నచ్చజెప్పగా, దానిలో భాగంగా బాధితులు నర్సింగ్ కళాశాల ఆనుకోని దుకాణాలను నిర్మించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల కంటే అక్కడ నిర్మిస్తున్న షాపుల సంఖ్య రోజురోజుకు పెరిగి 12 వరకు చేరుకుంది.
విలువైన సింగరేణి స్థలంలో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రోడ్ల వెడల్పులో నాలుగు షాపులు కోల్పోతే అక్కడ 12 షాపులు నిర్మించడం జరుగుతుందని, ఈ నిర్మాణాలకు సింగరేణి, మున్సిపాలిటీ నుంచి అనుమతులు ఉన్నాయా…? అన్న ఫిర్యాదులు వెలువెత్తిన క్రమంలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు సంఘటన స్థలంకు చేరుకొని తొలుత ఆరు షాపులను కూల్చివేశారు. స్థానికులు, బాధితులు గుమి కూడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా శుక్రవారం నాటి కూల్చివేతలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించగా స్పందించలేదు.