పెద్దపల్లి , ఫిబ్రవరి28 : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(Intermediate exams) పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Shri Harsha) అధికారులకు సూచించారు. శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 5 -25 వరకు ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పారా మెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ, మున్సిపల్, పోస్టల్, సంబంధిత ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.