పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సింగరేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. శిథిలాల కింద సింగరేణి అధికారి, ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం ఆరా తీశారు.
సహాయక చర్యలు వేగవంతం చేయాలని సింగరేణి ఎండీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. కార్మికులను వెలికితీసే చర్యలు ముమ్మరం చేశామని సింగరేణి ఎండీ శ్రీధర్.. సీఎం కేసీఆర్కు తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురు కార్మికులకు గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.