Peddapally | సుల్తానాబాద్ రూరల్/ఓదెల, మే 22: జిల్లాలో ఉన్న కాలువల పూడికతీత పనులు ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టి పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, ఓదెల మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలను కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో కాల్వలను వర్షా కాలం లోగా మేయిన్ కేనాల్ తో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని, రాబోయే 20 రోజుల లోగా కాల్వల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఓదెల మండలంలో ఉన్న దాదాపు 40 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాలువలు, ఇతర నీటిపారుదల కాలువలు పూడికతీత, చెత్త తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని, అవసరమైన చోట కాల్వ మరమ్మతుల పనులు కూడా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను అధిక సంఖ్యలో నియమించి వర్షాకాలం లోపు కాల్వ పూడికతీత పనులు పూర్తి చేయాలని, కాల్వ చివరి ఆయకట్టు వరకు నీటి ప్రవాహం చేరుకునేలా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం కాళిందిని, సుల్తానాబాద్ ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, ఓదెల ఎంపీడీవో తిరుపతి, ఎంపీ ఓ షబ్బీర్, ఏపిఓ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.