రామగిరి, సెప్టెంబర్ 20: పదవులు, పైసల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పష్టం చేశారు. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో పదవులు, పైసల కోసం పనిచేయలేదని, ఇక్కడి నీచమైన సంస్కృతిని, వాస్తవాలను ప్రజలకు వివరించి చైతన్యపర్చాలన్న ముఖ్య ఉద్దేశంతోనే వచ్చినట్లు చెప్పారు. సెంటినరీకాలనీలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు పలికిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాను ఎమ్మెల్యే, మంత్రిని కావాలని, బాగా పైసలు సంపాదించుకోవాలని చూస్తున్నానని కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంథనిలో కొంతమంది అరాచకాలు, ఒకే సామాజికవర్గ పెత్తందారి వ్య వస్థ, రాజ్యమేలుతున్న ఓ కుటుంబాన్ని ఎదురించేందుకే రాజకీయ వ్యవస్థలో అడుగు పెట్టానన్నా రు. కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
ఆర్జీ-2లో ఆర్కే కంపెనీలో సుమారు 600మంది కార్మికులు తమ హ క్కుల కోసం సమ్మె చేస్తే ఆనాడు రాష్ట్రంలో, ఢిల్లీ లో అధికారంలోఉన్న కాంగ్రెస్ దౌర్జన్యంగా ఉద్యోగాలు తొలగించిందని, తామే అండగా నిలిచి పోరాటం చేశామని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ఇప్పించిన చరిత్ర తమకే ఉందన్నారు. అంతేగాక ఇటీవల ఓసీపీలో ఐదుగురు కార్మికులు మృతి చెందితే వారికి అండగా నిలిచి పరిహారం ఇప్పించామన్నా రు. ఏఎల్పీ గనిలో ప్రమాదం జరిగి సింగరేణి అధికారితోపాటు ఔట్ సోర్సింగ్ కార్మికుడు చనిపోతేవారికి పరిహారం అందించేలా పోరాటం చేశామన్నారు. ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి నెలకు రూ.2.75 లక్షల వేతనం తీసుకున్న ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు.
మన ఓట్లతో గెలిచి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఈ రోజు ఏంచేస్తున్నాడో ప్రజలు గమనించాలన్నారు. లద్నాపూర్లో భూ నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ఇప్పించాలని ధర్నాచేస్తే అక్కడకువచ్చిన ఎమ్మెల్యే ఏం చేశాడని ప్రశ్నించారు. పేదోడి ఆకలి తీర్చాలన్నదే తన తపనే తప్ప ఏనాడూ పదవి కోసం ఆరాట పడలేదని స్పష్టం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే కార్మికులను అడ్డుగా పెట్టుకొని తమను బదనాం చేయాలని చూస్తున్నాడే కానీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనే ఆలోచన చేయడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.