పెద్దపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనాలయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ధి ఉత్తమ సీడ్ సైంటిస్ట్గా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో సీడ్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 27వ అన్యూవల్ జనరల్ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర స్ధాయి సీడ్మెన్ వార్షిక అవార్డు -2022లో భాగంగా ఉత్తమ సీడ్ సైంటిస్ట్ అవార్డును రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి చేతుల మీదుగా శ్రీధర్ అందుకున్నారు.
2015లో కూనారం సన్నాల పేరుతో విడుదలైన కేఎన్ఎం -118 అనే వరి వంగడాన్ని సృష్టించడంలో శ్రీధర్ కీలక పాత్ర పోషించారు. ఈ వంగడం 120 -125 రోజుల్లో కోతకు వచ్చి ఎకరానికి 30 -35 క్వింటాళ్ల దిగుబడినిస్తూ, అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఈ రకం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా రాష్ర్టాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అలాగే వివిధ రకాల వంగడాల విడుదలతో పాటు నాణ్యమైన విత్తనోత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ప్రైవేట్ విత్తన కంపెనీలకు 2013 నుంచి విత్తనాలు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది కూనారం పరిశోధనాలయం.