జూలపల్లి, అక్టోబర్ 9: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను నమ్మవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలను కోరారు. చేసిన పనులను చూసి మళ్లీ పట్టంగట్టాలని అభ్యర్థించారు. సోమవారం పెద్దాపూర్, వడ్కాపూర్లో ఇంటింటా ప్రచారం చేశారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆయన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో వాడవాడల కలియదిరుగుతూ ప్రచా రం నిర్వహించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేసిన పనులను వివరించి ఓట్లేయాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం దాసరి మాట్లాడారు. ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే ప్రతిపక్షాలను వారి పాలనలో చేసిన పనులను చెప్పాలని ప్రశ్నించాలని కోరారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, భారీ ప్రాజెక్టులు నిర్మించి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, ఆర్భీఎస్ మండలాధ్యక్షుడు విశారపు వెంకటేశం పాల్గొన్నారు.