మల్యాల, మే 12 : కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంలా మారింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షన్నరకుపైగా వచ్చిన దీక్షాపరులతో అంజన్న సన్నిధి పోటెత్తింది. ‘రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్ కీ’ నినాదాలతో గుట్టంతా మారుమోగింది.
మూడు రోజులపాటు ఉత్సవాలు కన్నులపండువను తలపించగా, మంగళవారం హనుమాన్ పెద్ద జయంతి అంగరంగ వైభవంగా సాగింది. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం నుంచి అధికారికంగా అందజేసిన పట్టు వస్ర్తాలతో మూలవిరాట్ ఆంజనేయస్వామిని అలంకరించగా, భక్తజనం దర్శించుకొని తన్మయత్వం చెందింది.