చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సెల్యూట్ చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. నేతన్న బతికితేనే మన చేనేత బతుకుతుందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల బతుకులు చిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన నేతన్నలు నేడు తమ బతుకుల కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలతో చేనేత రంగానికి ఊపిరి పోస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను మరిచి, పథకాలను నిలిపివేసి నేతన్నల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని హరీశ్రావు అన్నారు. మగ్గాలు మూగబోతున్నాయి.. వలసలు, అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. జాతికి బట్ట నేసే చేతులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని.. నేతన్నకు భరోసా కల్పించాలని.. చేనేతకు పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. నేతన్నను కాపాడుకుందాం.. చేనేతను బతికించుకుందాం అని నినదించారు.