మా చిరకాల కోరిక నెరవేరింది
నా పేరు అనుమాల సంతోష్. మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి. నేను ఎమ్మెస్సీ పూర్తి చేసిన. 2012లో వీఆర్ఏ ఉద్యోగంలో చేరిన. అప్పుడు నెల జీతం కేవలం రూ.3,200 మాత్రమే ఉండేది. చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడ్డం. ఆ తర్వాత మేం ఎన్నోసార్లు ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తే అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం రూ.6,000 జీతం పెంచింది. స్వరాష్ట్రంలో మేము అడగకుండానే మా జీతాన్ని సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రూ.10,500 వరకు పెంచిండు. ఇప్పుడు మమ్ముల్ని రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ ఇస్తామని చెప్పడంతో మా జీవితాలకు కొత్త వెలుగును ఇచ్చినట్లయింది. మా చిరకాల వాంఛ నెరవేరింది. ప్రభుత్వానికి వీఆర్ఏలమంతా కృతజ్ఞతలు చెబుతున్నం.
-అనుమాల సంతోష్, వీఆర్ఏ దొంగతుర్తి (ధర్మారం మండలం)
పేద కుటుంబాల్లో వెలుగులు
మా సేవలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తింపునిచ్చిండ్రు. గతంలో సమ్మె చేసిన సందర్భంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు కొత్త సచివాలయంలోని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. ఈ నిర్ణయంతో పేద కుటుంబాలకు చెందిన 23 వేల మంది వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది.
-కొప్పుల శ్రీలత వీఆర్ఏ, పెద్దపల్లి
రుణపడి ఉంటం
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న మాకు మండు వేసవిలో చల్లని కబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటం. గతంలో చాలీచాలని జీతంతో ఇల్లు గడవడమే కష్టమయ్యేది. మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు సాధారణ ఉద్యోగులతో పాటు పే స్కేల్ ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– గుమ్మడి రమ్య, వీఆర్ఏ(వెల్గటూర్)
సీఎం కేసీఆర్పై నమ్మకముంది
2012లో డ్యూటీలో చేరినం. అప్పటి నుంచి ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేసినం. గతంలో 3 వేల జీతంతో చేసినం. చాలీచాలని జీతంతో కుటుంబం గడవడం కష్టమయ్యేంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేతనం రూ.10 వేలకు పెంచింది. ఈ ప్రభుత్వ హయాంలో పర్మినెంట్ చేస్తారనే నమ్మకం ఉండె. అనుకున్నట్లే వీఆర్ఏలను పర్మినెంట్ చేస్త్తూ క్యాబినెట్ నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. మాకు న్యాయం జేసిన కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం.
-రేకులపల్లి రామకృష్ణారెడ్డి, వీఆర్ఏ అప్పారావుపేట(కొడిమ్యాల)
కలలో కూడా అనుకోలె
మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయని కలలో కూడా ఊహించ లేదు. మా సంఘాలతో కలిసి పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించదు అనుకున్నం. ఇపుడు మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ క్యాబినెట్లో తీర్మానించడం చాలా సంతోషకరం. ఈ నిర్ణయంతోని మా కుటుంబాలకు ఎంతో భరోసా కలిగింది. 2009 నుంచి రేణికుంట వీఆర్ఏగా పనిచేస్తున్న. ఉద్యోగం రెగ్యులర్ అవుతుందనే ఆశతోనే ఉన్న. మా ఆశను నెరవేర్చుతూ కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికీ మర్చిపోం. ఆయనకు జన్మంతా రుణపడి ఉంటాం..
– సంపత్, వీఆర్ఏ, రేణికుంట (తిమ్మాపూర్ మండలం)
ఇన్ని రోజులు గుర్తించినోళ్లే లేరు
ఇన్ని రోజులు మా కష్టాన్ని గుర్తించిన వారు లేరు. రెవెన్యూ శాఖలో చాలా కింది స్థాయిలో చిరుద్యోగులుగా ఉండి దుర్భురమైన బతుకులు బతుకుతున్నం. గ్రామాల్లో మేం చేస్తున్న చాకిరి ఇంతా అంతా కాదు. ప్రతి దానికి మేమే ముందుండాలి. ఇంత చేసినా మాకు చాలీ చాలని జీతాలు. మాకు న్యాయం కావాలని గతంలో ఆందోళనలు చేశాం. విజ్ఞప్తులు చేశాం. మా విన్నపాలను మన్నించిన కేసీఆర్ ఆలస్యంగానైనా న్యాయం చేశారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కేసీఆర్ సార్ మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నరు.
– కిన్నెర కొంరయ్య, వీఆర్ఏల సంఘం ప్రధాన కార్యదర్శి (కరీంనగర్)
పేదల పక్షపాతి
నేను మడక గ్రామంలో గత 27 ఏండ్ల సంది మా తండ్రి వారసత్వంగా వచ్చిన వీఆర్ఏ ఉద్యోగాన్ని చేస్తున్న. అప్పుడు కేవలం రూ. 510 మాత్రమే జీతం ఉండేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మా జీతాలను రూ. 11,200కు పెంచిండు. మమ్మల్ని రెగ్యులర్ జెయ్యాల్నని కొంతకాలంగా కోరుతున్నం. మా కష్టాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ మమ్మల్ని రెగ్యులర్ జేస్తమన్నడు. చాన సంతోషమైతంది. ఇందుకు సీఎం సార్కు కృతజ్ఞతలు చెబుతున్న. మా సమస్యలను పరిష్కరించి పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నరు.
-పోతుల స్వామి, వీఆర్ఏ, మడక(ఓదెల)
మాకు న్యాయం చేసిండు
నేను ఎనిమిదేండ్లుగ మా తండ్రి వారసత్వంగా వచ్చిన వీఆర్ఏ జాబ్ చేస్తున్న. అప్పుడు రూ.510 జీతం మాత్రమే ఉండే. ఆ జీతం ఏటూ సరిపోయేది కాదు. కాని కేసీఆర్ సార్ సీఎం అయినంక రూ.11,200కు పెంచిండు. ఎప్పటినుంచో ఉన్న మా సమస్యను కూడా ఇప్పుడు పరిష్కరించి మాకు న్యాయం జేసిండు. ఇప్పుడు మా జాబ్కు ఢోకా లేకుండా రెగ్యులర్ చేసినందుకు మేమందరం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
-వెలిశాని మహేశ్, వీఆర్ఏ, ఇందుర్తి(ఓదెల)
మాలో ధైర్యమొచ్చింది
నాపేరు రామిల్ల భీమయ్య. మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం. నేను నాకు వారసత్వంగా వచ్చిన వీఆర్ఏ ఉద్యోగాన్ని 38 యేండ్లుగా చేస్తున్న. 1985లో అప్పుడు వీఆర్ఏలకు నెలకు జీతం రూ.300 మాత్రమే చాలీచాలని జీతం ఉండె. కొన్నేండ్లకు రూ.500, రూ.750,3,000 పెంచిండ్రు. నాటి సమైక్య పాలనలో చివరగా పెరిగిన రూ.6,000 జీతంతో పని చేసినం. అప్పుడు వీఆర్ఏలమంతా వెట్టి చాకిరి జేసినం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో సీఎం కేసీఆర్ మా జీతాలను రూ.10,500కు పెంచిండు. డీఏ కూడా ఇచ్చి కొంతవరకు వేతనాలు పెంచడంతో మాలో ధైర్యమొచ్చింది. మా ఉద్యోగాలను పర్మినెంట్ చేసి జీతాలు పెంచాలని రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయించడంతో మేమంతా సంతోషంగా ఉన్నం. మేమంతా సారుకు రుణపడి ఉంటం.
– రామిల్ల భీమయ్య, వీఆర్ఏల మండలాధ్యక్షుడు (ధర్మారం మండలం)
ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నం
వీఆర్ఏలుగా ఉద్యోగంలోకి ఎక్కినా. మాలో ఏనాడూ సంతోషం లేదు. ఎప్పుడూ రెగ్యులర్ అయితదనే దిగులే ఉండేది. అప్పటినుంచి ఈ రోజు కోసం ఎదురు జూస్తున్నం. ఉద్యోగం వచ్చిన నాటి కంటే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రోజే నేను చాలా సంబురపడ్డా. మా వీఆర్ఏల కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాయి. చాలా ఆనందంగా ఉంది.
– మంథని కృష్ణ, వీఆర్ఏ (మంథని)
కేసీఆర్ సారు వల్లే సాధ్యమైంది
ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడం అభినందనీయం. రెగ్యులరైజ్తో పాటు వివిధ శాఖల్లో మమ్నల్ని భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కొన్నేండ్లుగా మేం రెగ్యులరైజ్ కోసం చేస్తున్న విజ్ఙప్తులు ఫలించాయి. సీఎం కేసీఆర్ సారు వల్లే ఇది సాధ్యమైంది. ఆయనకు మేమంతా ఎప్పటికీ రుణపడి ఉంటం.
– ఎల్దాసరి ప్రవీణ్, వీఆర్ఏ, ఆరవల్లి, వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు(పెగడపల్లి)
కేసీఆర్పై నమ్మకం నిలబడింది
కేసీఆర్ సార్ మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నరు. కొంత ఆలస్యమైనా మా విజ్ఞప్తిని మన్నించి మా కోసం మంచి నిర్ణయం తీసుకున్నరు. ఎన్నో రోజుల నుంచి చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ కుటుంబాలను భారంగా గడుపుతున్నం. ఎంత పని భారం ఉన్నా భరించి మాకు భవిష్యత్తు ఉంటుందని ఆశపడి ఉద్యోగం చేస్తూ వచ్చాం. మాకు మంచి భవిష్యత్తును చూపినందుకు సీఎం కేసీఆర్ సార్కు బతికి ఉన్నంత కాలం రుణపడి ఉంటం..
– నలువాల మల్లేశం, వీఆర్ఏ సంఘం చైర్మన్ (కరీంనగర్)