తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో అలంకరించిన పోలీస్ పెట్రోకార్, బ్లూకోల్ట్స్, ఫైర్, ట్రాఫిక్ వెహికిళ్లు, డాగ్స్క్వాడ్లతో చేపట్టిన ర్యాలీని పరేడ్ గ్రౌండ్లో మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తమ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. పోలీస్ కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు విభిన్న వేషధారణతో సందడి చేశారు.
రాంనగర్, జూన్ 4: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం సురక్ష దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, ఆయా విభాగాల పనితీరును తెలియజేస్తూ, నగరంలో నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక, పెట్రోకార్, బ్లూ కోల్ట్స్, ట్రాఫిక్ సిబ్బంది వాహనాలతో చేపట్టిన ర్యాలీని మంత్రి గంగుల, సీపీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కాగా, ర్యాలీ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై వన్ టౌన్ ఠాణా – కమాన్ చౌరస్తా – మంచిర్యాల చౌరస్తా – గాంధీరోడ్ – రాజీవ్ చౌక్ -తెలంగాణ అమరవీరుల స్తూపం మీదుగా తిరిగి పరేడ్ గ్రౌండ్కు చేరుకుంది. కాగా, పలువురు చిన్నారులు జాతీయజెండా చేతబూని ఇందిరాక్ వద్ద స్కేటింగ్ చేస్తూ స్వాగతం పలుకగా, ఇది కార్యక్రమానికే హైలెట్గా నిలిచింది. అలాగే ఇందిరాక్ వద్ద బాంబ్ డిస్పోజబుల్ స్వాడ్, డాగ్ స్వాడ్, అగ్నిమాపక సిబ్బంది పలు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా, పోలీసుశాఖలో ఉత్తమ పనితీరు చూపిన పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది 250 మందికి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీఆర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరీమా అగర్వాల్ ఉన్నారు.
సురక్ష దినోత్సవం సందర్భంగా రాత్రి వీ కన్వెన్షన్లో పోలీసుల ఆధ్వర్యంలో బడా ఖాన నిర్వహించగా, మంత్రి గంగుల, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తోపాటు కలెక్టర్ కర్ణన్, సీపీ, పోలీసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శాంత్రిభదత్రల పరిరక్షణలో పోలీసుల కృషి అమోఘం. ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదురోవడం వల్లే ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటోంది. కరీంనగర్ నేడు శాంతియుతంగా ఉన్నదంటే అందుకు పోలీసులు అందించిన సేవలే నిదర్శనమని చెప్పాలి. కరోనా కష్టకాలంలోనూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించారు. ఎన్నో సంచలనాత్మకమైన కేసులను సులువుగా ఛేదించారు. అజ్ఞాతంలో ఉన్న ఎంతోమందిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చాలా శ్రమించారు. అలావచ్చిన వారంతా సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్నారంటే ఆ కీర్తి పోలీసులకు మాత్రమే దక్కుతుంది. నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా, యువతకు కెరీర్ గైడెన్స్ కోసం ప్రేరణ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, యువతను సన్మార్గంలో నడిపించేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రజలపై వారికి ఉన్న బాధ్యతను తెలియజేస్తున్నది.
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం చొరవతో పోలీస్ శాఖ ఊహించని రీతిలో అభివృద్ధి చెందింది. అత్యాధునిక సాంకేతికత మాకు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా నేరాల ఛేదన ఎంతో సులువవుతున్నది. ఇంకా నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తూ పరిషరిస్తూ ముందుకుసాగుతున్నాం. తమ సిబ్బంది విధినిర్వహణలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేస్తున్నారు. ప్రమాదాల నివారణకు డ్రంకైన్ డ్రైవ్లు తరచూ నిర్వహిస్తున్నాం. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేస్తున్నాం. ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– ఎల్ సుబ్బారాయుడు, కరీంనగర్ సీపీ