కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర నాయకుల ఎదుటే బహిర్గతమవుతున్నాయి. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశాల వేదికగా బట్టబయలయ్యాయి. ఎల్వోసీ గురించి ప్రశ్నించిన కార్యకర్తపైకి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి ఏకంగా వేదికపై నుంచి కిందకు దూకడం, వెళ్లిపోవాలంటూ నెట్టేస్తూ ఆగ్రహించడం, ఆ కార్యకర్తతోపాటు మరికొంత మంది కార్యకర్తలు ఎదురుతిరగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో స్టేజీ పైనున్న మంత్రి పొన్నంతోపాటు మరికొంత మంది నాయకులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అలాగే హుజూరాబాద్ సమావేశంలోనూ పాత, కొత్త నాయకుల మధ్య గొడవ జరిగింది.
తిమ్మాపూర్/ హుజూరాబాద్ ఏప్రిల్ 18 : కరీంనగర్ నగర పరిధి అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాగా, మానకొండూర్ మండలం లక్ష్మీపూర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఎడ్ల భద్రయ్య తమ గ్రామంలోని పోచమ్మ గుడికి వెళ్లే దారిని కాల్వ మహేందర్ అనే వ్యక్తి కబ్జా చేశాడని రెండు నెలల కింద ఎమ్మెల్యేకు తెలిపాడు. అయితే, ఇటీవల మహేందర్ అనారోగ్యానికి, చికిత్స కోసం 2.5 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశాడు.
ఈ విషయమై భద్రయ్య సమావేశ వేదిక ముందుకెళ్లి.. తమను కాదని మహేందర్కు ఎల్వోసీ ఎలా ఇచ్చారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వేదికపై నుంచి కిందికి దూకి కార్యకర్తపైకి దూసుకెళ్లాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న కార్యకర్తలు ఎమ్మెల్యేను, కార్యకర్తను నిలువరించారు. ఇద్దరు మాటామాటా అనుకున్నారు.
‘కొడతావా.. కొట్టు. ఎంత కొడతావో కొట్టు?’ అంటూ ఎమ్మెల్యేను భద్రయ్య నిలదీశాడు. అయినా వినని కవ్వంపల్లి ఆ కార్యకర్తను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నెట్టేశాడు. దీంతో భద్రయ్యకు తోడుగా మరి కొంత మంది కార్యకర్తలు సైతం ఎదురుతిరిగారు. స్టేజిపైన ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కవ్వంపల్లిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఆయనతోపాటు నాయకులు కూడా జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ సద్దుమణించింది. అయితే ఎమ్మెల్యే కార్యకర్త పైకి దూసుకెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హుజూరాబాద్ పట్టణంలోని ఓ గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ గొడవ జరిగింది. పాత, కొత్త కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకున్నది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా, అనుకున్న సమయానికి రాలేదు. దాంతో కాంగ్రెస్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి.. ముఖ్య నాయకులను సభపైకి ఆహ్వానిస్తుంటే ఒక్కొక్కరుగా వచ్చి ఆసీనులవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే పార్టీలో చేరిన దేశిని కోటి, వడ్లూరి విజయ్కుమార్, నేరెళ్ల మహేందర్గౌడ్, తదితర నాయకులను పిలువగా స్టేజీపైకి వచ్చి కూర్చున్నారు. అయితే ఇంతలోనే కొందరు కార్యకర్తలు స్టేజీపైకి వచ్చి గొడవకు దిగారు.
ఆది నుంచీ పార్టీ కోసం పనిచేసిన తమను కాదని, నిన్నా మొన్న పార్టీలో చేరిన నాయకులను పిలవడం సమంజసం కాదని పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ను నిలదీశారు. ఆయన వెంటనే తేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వాళ్లు వినకపోవడంతో పాత, కొత్త నాయకుల మధ్య గలాట మొదలైంది. చివరకు స్టేజీపై నియోజకవర్గ ఇన్చార్జిలు తప్ప వేరే వాళ్లను పిలిచేది లేదని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దాదాపు అరగంట పాటు ఏం జరుగుతందో అక్కడ ఉన్న కార్యకర్తలకు పాలుపోలేదు. పాత క్యాడర్కు విలువ ఇవ్వకపోతే గిట్లనే గొడవ జరుగుతుందని పలువురు కార్యకర్తలు వాపోయారు. మరోవైపు మధ్యా హ్నం 2 గంటలకు సమావేశానికి పొన్నం రావాల్సి ఉండ గా.. సాయంత్రం 4.30కు రావడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకే తాము వచ్చామని, ఎంత సేపు వేచి ఉండాలని ప్రశ్నించారు.