
Dharmaram | ధర్మారం, మార్చి 26: పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా విద్యా అధికారి గద్వాల శారద సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో ధర్మారం సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ జోష్ పేర-23 వ వార్షికోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో శారద మాట్లాడుతూ పాఠశాలలకు తమ పిల్లలు వెళ్లి చదువుకుంటున్న క్రమంలో వారిపై తల్లిదండ్రులు దృష్టి సారించి వారు ఎలా విద్యను అభ్యసిస్తున్నారనే దానిని గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ముఖ్యంగా పిల్లలను మొబైల్ ఫోన్ లకు తల్లిదండ్రులు దూరంగా ఉంచాలని ఆమె పేర్కొన్నారు. . విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది టెన్త్ లో పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఉత్తీర్ణత సాధించాలని ఆమె ఆకాంక్షించారు .ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా మండల విద్యాధికారి పొతు ప్రభాకర్, పాఠశాల ఎండీ జైన రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.