సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. డెంగీ, మలేరియాతోపాటు సీజనల్గా వచ్చే జ్వరాలపై ప్రధానంగా దృష్టిసారించింది. కేసులు నమోదైన చోట ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు అధికారులు, సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఈ బృందాల ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. అంతే కాకుండా పంచాయతీలు, మున్సిపాలిటీల దృష్టికి తీసుకెళ్లి పారిశుధ్య లోపాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అయితే గతంలోలాగా జ్వరాల తీవ్రత లేక పోయినా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నది.
– కరీంనగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
కరీంనగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: వానకాలం వచ్చిందంటే గతంలో విపరీతమైన జ్వరాలు వచ్చేవి. ముఖ్యంగా జ్వరా లు, డయేరియా, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువగా కనిపించేవి. ఇపుడు గ్రామాలు, పట్టణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో ప్రభావం తగ్గింది. గతంలో లాగా ఇపుడు జ్వరాలు తీవ్రత లేనప్పటికీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు సేవలందించే ప్రయత్నం చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు బృందాలను ఏర్పాటు చేసి నిత్యం ప్రజల మధ్య ఉండి జ్వరాల తీవ్రతను సర్వే చేస్తున్నారు. అక్కడక్కడా డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. గత ఐదేళ్లలో కేసుల నమోదును పరిశీలిస్తే ఈ ఏడాది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు బాగా తగ్గాయి. మరణాల సంఖ్య కూడా నమోదు కావడం లేదు. డెంగ్యూ కేసులు పరిశీలిస్తే 2019లో 297, 2020లో 13, 2021లో 356, 2022లో 437, 2023లో ఇప్పటి వరకు 36 నుంచి 40 కేసులు మాత్రమే నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు నమోదైన గ్రామాలు, పట్టణాలకు వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు వెళ్తున్నాయి. అక్కడి పరిసరాల్లో పైరాత్రాన్ అనే మందును స్ప్రే చేస్తున్నారు. కేసులు నమోదైన చుట్టు పక్కల 100 మీటర్ల పరిధిలో ఈ మందును స్ప్రే చేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం రెండు బృందాలు పనిచేస్తున్నాయి. కేసుల సంఖ్య పెరిగితే మరిన్ని బృందాలను ఏర్పాటు చేస్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చెబుతున్నారు. ఐదేళ్లలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈ ఐదేళ్లలో కేవలం 22 కేసులు మాత్రమే నమోదుకాగా ఈ ఏడాది వాటి సంఖ్య 2 మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రధానంగా డెంగ్యూ వ్యాధి విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్నది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో ఏటేటా జ్వ రాలు, వ్యాధుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎక్కడైన వ్యక్తిగతంగా నివాస గృహాల్లో పారిశుధ్య లోపం కనిపించిన చోట దోమల వ్యాప్తితో జ్వ రాలు వస్తున్నాయని, ఇలాంటి చోట ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వారంలో మంగళ, శుక్రవారాలు డ్రైడేగా పాటిస్తున్నారు. ఈ రెండు రోజులు అధికారులు ని వాస గృహాలను పరిశీలించి ఎక్కువ రోజులు నిలు వ ఉన్న నీటిని, వర్షపు నీరు నిలువ ఉండే పా త్ర లు, కొబ్బరి చిప్పలు, టైర్లు వంటివి ఉంటే వాటిని తొలగిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్, ఫినాయిల్, ఆయిల్ బాల్స్ వంటి వాడుతున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి పనిచేస్తున్నాయి.
దోమల నిర్మూలను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇప్పటికే కలెక్టర్ బీ గోపి ఆదేశాలు జారీ చేశారు. మురికి కాలువలను ఎప్పటికపుడు శుభ్రం చేయించి నీరు నిలువకుండా, దోమ లు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. నివాస గృహాల పరిసరాల్లో రోడ్లు, ఎప్పటికపుడు శుభ్రం చేయించి చెత్తా చెదారాన్ని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. మురుగు కాలువల్లో ఎప్పటికపుడు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మ ంచి నీటి పైపుల లీకేజీలు అరికడుతున్నారు. పబ్లిక్ నల్లాల వద్ద, చేతి పంపుల వద్ద అపరిశుభ్రత లే కుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి చో ట్ల బట్టలు ఉతకడం, పశువులను కడగడం వంటి చర్యలను అరికడుతున్నారు. డెంగ్యూ వ్యాధిని అ రికట్టేందుకు నివాస ప్రాంతంలో ఉండే ఖాళీ డ బ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, గోళాలు, కూలర్లలో నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో క్రమం తప్పకుండా నివారణ చర్యలు జరుగుతున్నాయి.
జ్వరాల తీవ్రత లేకున్నా వైద్య, ఆరోగ్య శాఖ ఎ క్కడా నిర్లక్ష్యం చేయడం లేదు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో నిత్యం సర్వే చేయిస్తున్నారు. జ్వరాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ పీహెచ్సీలకుగానీ దవాఖానాలకు గానీ వెళ్లి చికిత్స చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అంతే కాకుండా ప్రజలకు ఆరోగ్య విషయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నీటిని కాచి వడబోసిన తర్వాత తాగాలని సూచిస్తున్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడేను పాటించేలా చూస్తున్నారు. అంతే కాకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటి పరిసరాల్లో ఎక్కడైన నీటి నిలువలు ఉన్నాయా లేదా చూసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆశా వర్కర్లు మొద లు జిల్లా స్థాయి అధికారుల వరకు పాల్గొని ప్రజలకు ఆరోగ్యాలు, పారిశుధ్యం విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్వరాల తీవ్రత తగ్గు ముఖం పట్టిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.