ఉమ్మడి పాలనలో అనేక సమస్యలతో సతమతమైన ఆ ఊరు స్వపరిపాలనలో కొత్తరూపు సంతరించుకున్నది. ఇన్నాళ్లు శిథిల భవనాలు, కంపుకొట్టే డ్రైనేజీలు, చెత్తాచెదారంతో నిండిన రహదారులతో కళ తప్పిన పల్లె ఇప్పుడు ‘పల్లె ప్రగతి’ స్ఫూర్తితో రూపురేఖలు మార్చుకున్నది. అద్దాల్లాంటి రోడ్లు, పరిశుభ్రమైన మురుగుకాలువలు, సకల హంగులతో కూడిన కార్యాలయాలతో సరికొత్తగా దర్శనమిస్తున్నది. పచ్చదనం కానరాక వెలవెలబోయిన ఆ గ్రామం అవెన్యూప్లాంటేషన్, పల్లె ప్రకృతివనంతో హరిత శోభను సంతరిచుకున్నది. అభివృద్ధి పథకాలకు సర్కారు నిధుల వరద పారించడంతో నయా సుల్తాన్పూర్గా రూపుదిద్దుకున్నది.
పెద్దపల్లి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం ఎలిగేడు మండలంలో ఉన్న సుల్తాన్పూర్ 1959లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. జీపీ కార్యాలయం, పీహెచ్సీ సబ్ సెంటర్ భవనం, రెండు ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలమై ఉద్యోగులు భయభయంగా విధులు నిర్వర్తించేవారు. ఫలితంగా 20 ఏండ్లుగా పీహెచ్సీ సబ్ సెంటర్లో వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. మూడేండ్ల క్రితం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి గ్రామం రూపురేఖలు మారిపోయాయి. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయి. పీహెచ్సీ సబ్సెంటర్ భవనానికి మరమ్మతులు చేయించారు. రెండు ప్రాథమిక పాఠశాలల భవనాలను పునరుద్ధరించి రంగులు వేయించారు. 40 లక్షలతో సచివాలయం తరహాలో జీపీ భవనాన్ని నిర్మించారు. సర్పంచ్, కార్యదర్శుల చాంబర్లు, పంచాయతీ సిబ్బందికి ప్రత్యేక గదులు నిర్మించారు. పంచాయతీ ప్రాంగణంలో తీరొక్క మొక్కలు పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. కార్యాలయానికి ఎదురుగా వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేశారు.
వెల్లివిరుస్తున్న చైతన్యం
పల్లె ప్రగతి గ్రామంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికీ ప్రత్యేక వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. శుభకార్యాలు, విందులు, వినోదాల సమయంలో ప్లేట్లు, ఆహార వ్యర్థాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే ప్రత్యేక వాహనంలో వేస్తున్నారు. దీంతో ఆ చెత్తను నేరుగా చెత్త సేకరణ కేంద్రం(సెగ్రిగేషన్ షెడ్)కు తరలిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, తడిచెత్తతో సేంద్రియ ఎరువును తయారుచేసి విక్రయిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నారు.
పల్లె ప్రగతి మార్క్
పల్లె ప్రగతి కార్యక్రమంతో సుల్తాన్పూర్ రూపురేఖలు మారిపోయాయి. ఈ కార్యక్రమం కింద రూ. 7 కోట్లతో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి-సుల్తాన్పూర్ వరకు, రూ. 1.75 కోట్లతో సుల్తాన్పూర్-వెదిరిగట్ల నడుమ రోడ్డును అభివృద్ధి చేశారు. రూ. 22 లక్షలతో రైతు వేదిక , రూ. 12.50 లక్షలతో శ్మశానవాటిక, రూ. 2.50లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ. 12ల క్షలతో డ్రైనేజీలు, రూ. 1.50 లక్షలతో ఐదుచోట్ల కల్వర్టులు, రూ. 20 లక్షల జీపీ నిధులతో ఆరు షాపింగ్ కాంప్లెక్స్ షెడ్లు, గ్రామంలోని రెండు స్కూళ్లల్లో రూ. లక్షతో మరుగుదొడ్ల నిర్మాణం, రూ. 1.20 లక్షలతో సబ్ సెంటర్కు మరమ్మతులు చేపట్టారు.
వాట్సాప్ గ్రూపులు.. పరిష్కార వేదికలు
2011జనాభా లెక్కల ప్రకారంగా గ్రామంలో 3467జనాభా, 748 కుటుంబాలు ఉండగా, సర్పంచ్ అర్శనపెల్లి వెంకటేశ్వర్రావు సమస్యలను ఎప్పటికప్పుడు తెలిసేలా గ్రామ అధికారులతో ప్రత్యేకంగా మూడు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. వీధుల వారీగా చైతన్యం కలిగిన యువతీ, యువకులు, మహిళలు, పురుషులను ఆ గ్రూపులో చేర్చారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి రోజు గ్రామస్తులు ఆ గ్రూపులో పోస్టు చేస్తే ఆ వెంటే పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడైనా బల్బ్ వెలగకపోతే పోస్ట్ పెట్టిన రెండు రోజుల్లో లైట్లు బిగిస్తున్నారు. చెత్త ఉన్నా.. డ్రైనేజీ జామ్ అయినా గ్రూపుల్లో పెట్టిన వెంటనే తొలగించేలా మానిటరింగ్ చేస్తున్నారు.
ఇంటింటికీ భగీరథ నీరు
ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ సురక్షితమైన నీరందిస్తున్నది. ఈ స్కీంతో విద్యుత్ బిల్లుల భారం సైతం గణనీయంగా తగ్గింది. గతంలో ప్రతినెలా వీధి దీపాలు, బోర్ల ద్వారా నీటి సరఫరాతో రూ. లక్ష దాకా కరెంట్ బిల్లు వచ్చేది. ప్రస్తుతం భగీరథ కింద వాటర్ట్యాంకులను నిర్మించి పైప్లైన్ల ద్వారా నీటిని అందిస్తుండడంతో కరెంట్ బిల్లుల భారం భారీగా తగ్గింది. ఇప్పుడు కేవలం పంచాయతీ నుంచి 20 వేలు మాత్రమే చెల్లిస్తున్నామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
దాతల సహకారం
ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు దాతల సహకారంతో గ్రామం ప్రగతి పథంలో ముందుకెళ్తున్నది. సర్పంచ్ అర్శనపెల్లి వెంకటేశ్వర్రావు 2.50 లక్షలు వెచ్చిందచి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. మరో లక్షతో షెడ్డును నిర్మించారు. రెండు ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు దాతలు ఉచితంగా అల్ఫాహారాన్ని అందిస్తున్నారు. అలాగే షూస్, టైస్, అవసరమైన టెక్ట్స్, నోట్ బుక్స్ ఉచితంగా అందిస్తున్నారు.
చేసిన పనులివే..
7 కోట్లతో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి-సుల్తాన్పూర్ వరకు రోడ్డు
1.75 కోట్లతో సుల్తాన్పూర్-వెదిరిగట్ల మధ్యన రోడ్డు
22 లక్షలతో రైతు వేదిక నిర్మాణం
12.50 లక్షలతో శ్మశానవాటిక
2.50 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు
12ల క్షలతో డ్రైనేజీలు
1.50 లక్షలతో ఐదుచోట్ల కల్వర్టులు
20 లక్షల జీపీ నిధులతో ఆరు షాపింగ్ కాంప్లెక్స్ షెడ్లు
2లక్షలతో రెండు స్కూళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం
1.20 లక్షలతో సబ్ సెంటర్కు మరమ్మతులు
పల్లె ప్రగతితోనే అభివృద్ధి..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామం అభివృద్ధి పథంలో సాగుతున్నది. రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, రైతు వేదిక, పంచాయతీ భవనాలను నిర్మించుకున్నం. పీహెచ్సీ సబ్ సెంటర్, ప్రభుత్వ స్కూళ్లకు మరమ్మతులు చేయించినం. అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలతో గ్రీనరీ బాగా పెరిగింది. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు.
-అర్శనపెల్లి వెంకటేశ్వర్రావు, సుల్తాన్పూర్ సర్పంచ్