పల్లె ప్రగతితో విప్లవాత్మక మార్పు
ఊరూరా యజ్ఞంలా సాగిన కార్యక్రమాలు
మారిపోయిన గ్రామాల రూపురేఖలు
ముఖచిత్రం మార్చిన ట్రాక్టర్లు
శుభ్రంగా వీధులు.. అద్దాల్లా దారులు
ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతి వనాలు
సామాజిక మార్పు తెచ్చిన వైకుంఠధామాలు
తొలిగిన విద్యుత్ సమస్యలు.. రాత్రివేళ ఎల్ఈడీ వెలుగులు
సంపద సృష్టిస్తున్న సెగ్రిగేషన్ షెడ్లు
చెప్పుకొంటూ పోతే కోకొల్లలు
మన పల్లె మారిపోయింది.. మూడేళ్లలోనే ఎంతగానో మారిపోయింది.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘పల్లె ప్రగతి’తో సరికొత్తగా సింగారించుకున్నది.. నాలుగు విడుతలు యజ్ఞంలా సాగిన కార్యక్రమాలతో సరికొత్త రూపు సంతరించుకున్నది.. ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్రాక్టర్ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. పారిశుధ్యం, హరితహారానికి కీలకమై, క్లీన్ అండ్ గ్రీన్గా మార్చింది.. చెత్తను ఏరేయడమే కాదు, ఊరంతా పచ్చదనాన్ని పరిచేసింది.. వీధులన్నీ శుభ్రంగా మెరుస్తుండగా, రోడ్లన్నీ అద్దాల్లా మారాయి.. దారుల పక్కన నాటిన మొక్కలు ఏపుగా పెరిగి స్వాగతం పలుకుతున్నాయి.. విద్యుత్ సమస్యలు పరిష్కరించడంతో రాత్రి వేళ వెలుగులు విరజిమ్ముతున్నాయి.. తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదం పంచుతున్నాయి.. సెగ్రిగేషన్ షెడ్లు పంచాయతీలకు సంపదను సృష్టిస్తున్నాయి.. వైకుంఠధామాలు, కమ్యూనిటీ భవనాలు, రైతువేదికలు ప్రయోజనకరంగా మారాయి.. ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి ఐదో విడుత చేపట్టనుండగా, మన ఊరు మరింత మెరిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..
పల్లె ప్రగతి
మొదటి విడుత
2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు
రెండో విడుత
2020 జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు
మూడో విడుత
2020 జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు
నాలుగో విడుత
2021 జూలై 1 నుంచి 10వ తేదీ వరకు
ఐదో విడుత (ప్రస్తుతం)
2022 మే 20 నుంచి జూన్ 5 తేదీ వరకు
కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక పల్లెలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి పంచాయతీల ద్వారా ఆచరణలో పెడుతున్న ఈ కార్యక్రమం ప్రతి పల్లెలో అద్భుత అభివృద్ధిని సాధిస్తోంది. కేవలం ప్రగతి మాత్రమే కాకుండా గ్రామీణ ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచింది. తమ పల్లెపై వారికి ఉన్న బాధ్యతలను గుర్తు చేసిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్లపై చెత్తా చెదారం కనిపించేది. సిల్ట్తో నిండిన మురుగు కాలువల ద్వారా బయటికి వచ్చే కలుషిత నీరు పరిసరాలను కాలుష్యంగా మార్చేది. పారిశుధ్య లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ను సమకూర్చింది. ఈ నిర్ణయం గ్రామాల్లోని పారిశుధ్యాన్ని పరిపూర్ణం చేసింది. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా రోడ్లు, మురుగు కాలువలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాలు మినహా వారంలో ఐదు రోజులు పారిశుధ్యం కోసం పంచాయతీలు ట్రాక్టర్లను ఉపయోగించుకుంటున్నాయి. ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లకు తరలిస్తున్నారు.
అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. ఈ చెత్తతో కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ కంపోస్టును గ్రామాల్లో నాటిన మొక్కలకు ఎరువుగా వాడుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కంపోస్టును ప్యాక్ చేసి కిలో రూ.10కు విక్రయిస్తున్నారు. స్థానిక ప్రజలు, రైతులు ఈ ఎరువును విరివిగా కొనుగోలు చేసుకుంటున్నారు. తద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తోంది. ప్రతి మంగళ, బుధవారాల్లో ట్రాక్టర్ ద్వారా చెట్లకు నీళ్లు పోయడంతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద బిల్లులు వస్తున్నాయి. ఇక పల్లెలో ప్రకృతి వనాల ఏర్పాటుతో పచ్చదనం పెరిగింది. మరి కొద్ది రోజుల్లోనే సందర్శకులను అనుమతించే అవకాశం వస్తుంది. ఇవి కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్యం మెరుగు పడటమే కాకుండా రెండేళ్ల కింద నాటిన మొక్కలు ఏపుగా ఎదిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. వైకుంఠధామాల ఏర్పాటుతో గ్రామాల్లో అంతిమ సంస్కారాలకు లోటు తీరిపోయింది. ఈ వేదికలకు కులాలకు అతీతంగా మారాయి. కొన్ని గ్రామాల్లో వైకుంఠ రథాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థను కూడా పల్లె ప్రగతి మెరుగు పర్చింది. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా ఎల్ఈడీ లైట్ల వెలుగులు జిగేల్మంటున్నాయి.
ప్రజల్లో పెరిగిన అవగాహన
పల్లె ప్రగతి ద్వారా ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. గ్రామం పట్ల తమకున్న బాధ్యతను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో గతంలో పల్లె ప్రజల్లో ఉన్న వైఖరి పూర్తిగా మారిపోయింది. గతంలో రోడ్ల మీద, మురుగు కాలువల్లో చెత్తా చెదారాన్ని పారవేసే వారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించిన తడి, పొడి చెత్త బుట్టలను వినియోగించుకుంటున్నారు. చెత్తను వేరు చేసి వీటిలో పడేస్తున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రాగానే బాధ్యతగా అందులో పడేస్తున్నారు. ఏడాదికి.. ఇప్పటికి గ్రామస్తుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు రోడ్లపై చెత్త వేస్తే గ్రామ పంచాయతీ రూ.500 జరిమానా విధించేది. ఇప్పుడు జరిమానాలు తగ్గిపోవడం వారిలో కలిగిన మార్పునకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదొక్కటే కాకుండా పంచాయతీలు చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ విషయంలోనూ ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మొక్కలను సంరక్షించుకుంటున్నారు. మొదటి విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో జరిగిన శ్రమదానం ద్వారా గ్రామాల్లో ప్రజలకు బాధ్యత తెలిసి వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.