కర్షకలోకం ఆనందంలో మునిగితేలుతున్నది. రుణమాఫీ ప్రకటనతో ధూంధాం చేసుకుంటున్నది. లక్షలోపు రుణం మాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం, ఈ ప్రక్రియ వెనువెంటే ప్రారంభం కావడంతో సంబురాలతో హోరెత్తిస్తున్నది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్వీట్లు పంచుకుంటూ.. పటాకులు కాలుస్తూ.. రైతుబాంధవుడు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసింది. పంట చేలల్లోనూ వేడుకలు జరుపుకుంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చాటుతుండగా, ఏ పల్లెకు వెళ్లినా పండుగవాతావరణం కనిపించింది.
– కరీంనగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం గోపాల్పూర్ క్రాసింగ్ వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ రెడ్డవేని మధు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ పాల్గొనగా, శంకరపట్నం మండలం వంకాయగూడెంలో పంట పొలాల్లోనే రైతులు, కూలీలు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ఎక్స్ రోడ్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే బాలకిషన్ చిత్ర పటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటీ వెంకట్రావు, జడ్పీటీసీ మహేశ్, ఎంపీపీలు సంబురాలు చేసుకున్నారు. కరీంనగర్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): లక్ష లోపు పంట రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఊరూరా పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నందుకు రైతుబాంధవుడు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎవుసాన్ని పండుగలా మార్చారని, రైతులకు అడుగకుండానే అన్నీ చేస్తున్నారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీర్చారని, రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారని, రైతుబీమాతో భరోసానిస్తున్నారని, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నాడని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితులతో రుణమాఫీ ఆలస్యమైనా ఇప్పుడు చేస్తున్నారని, ఇది చాలా గొప్ప నిర్ణయం అని వేయినోళ్ల పొగుడుతున్నారు.
రైతులు బాగుండాలని, లాభం కావాలని మా మేలు కోరే నాయకుడు సీఎం కేసీఆర్. అందుకే మా కోసం ఎన్నో పథకాలు తెస్తుండు. 24 గంటల కరెంట్ ఇత్తండు. రైతు బంధు కింద పెట్టుబడి సాయం చేస్తండు. రైతు బీమాతో కుటుంబాలకు దీమా కల్పిస్తండు. మాకు ఏ లోటూ లేకుంట చూసుకుంటండు. తెలంగాణ రాకపోయి, కేసీఆర్ సీఎం కాకపోతే మా బతుకులు ఘోరం అయితుండె. ఆ దేవుని పుణ్యమా అని మా రైతుల అదృష్టం కొద్ది కేసీఆర్ సార్ మాకు దొరికిండు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినయిగానీ, మా కోసం ఏ ఒక్క పనీ చేయలేదు. నిండా ముంచిన్రు. కేసీఆర్ ఒక్కడే మమ్ముల ఆదుకున్నడు. కాళేశ్వరంతో పొలాలకు పుష్కలంగా నీళ్లిస్తండు. ఎవుసాన్ని పండుగలా మార్చిండు. ఇప్పుడు రుణమాఫీ చేస్తుండు. మా లోన్లన్నీ మాఫీ అయితయి. చానా సంతోషం.
– అనుముల ఆదిరెడ్డి, రైతు, గోపాల్పూర్ (కరీంనగర్ రూరల్)
తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతు ప్రభుత్వం అచ్చింది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతు బంధువు, రైతు బీమా, సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తండు. రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నడు. వడగండ్లతో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇస్తనని రైతు సమస్యలు, బాధలు తెలిసిన నాయకుడు అని మరోసారి రుజువు చేసిండు. రుణమాఫీ వట్టిదే అని చాలా మంది అన్నరు. కానీ కేసీఆర్ ఇచ్చిన మాట తప్పలే. అన్నట్లే లోన్లు మాఫీ చేస్తండు. ఇలాంటి నాయకుడిని మేం వదులుకోం.
రైతుల కష్టాలు తెలిసిన నాయకుడే సీఎం కేసీఆర్. ఆయన రైతుల కోసం చేయని పని లేదు. ఏది కావాలో అది ఇస్తండు. అడుగకపోయినా అన్నీ తెలుసుకొని చేస్తండు. ఇట్లాంటి ముఖ్యమంత్రి అదృష్టం కొద్ది మాకు దొరికిండు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా మమ్ముల ఆదుకుంటున్నడు. నాకు రంగంపల్లిల నాలుగెకురాల వ్యవసాయ భూమి ఉంది. నేను బ్యాంకుల 2లక్షల అప్పు తీసుకున్న. నిన్న కేసీఆర్ రూ.లక్ష దాకా ఉన్న లోన్లు మాఫీ అని చెప్పిండు. నా లోన్ లక్ష మాఫీ అయితది. ఎంత కట్టం చేత్తే లక్ష రూపాయలు వస్తయో మాకు తెలుసు.
– పూదరి మల్లయ్య, రైతు రంగంపల్లి (పెద్దపల్లి మండలం)
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అప్పట్ల బ్యాంకుల 50వేల లోన్ తీసుకున్న. ఇప్పుడు రుణమాఫీ చేస్తే నా లోన్ కూడా మాఫీ అయితది. సీఎం కేసీఆర్ లేకపోతే మా రైతులే లేరు. ఆగమైన ఎవుసాన్ని తెలంగాణల పండగలా చేసిండు. మా కోసం అనేక పథకాలు తెచ్చి దేవుడైండు. మాటిస్తే కచ్చితంగా చేస్తడు.
– జక్కుల లక్ష్మీనారాయణ, రైతు, పెద్దకల్వల (పెద్దపల్లి మండలం)
సీఎం కేసీఆర్ సారు మా రైతులు అడుగకముందే అన్నీ చేస్తండు. గతంలో ఎవలూ ఇట్ల చేయలె. రైతు బీమాతో భరోసా ఇచ్చిండు. ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయం ఇస్తండు. దేశంలో ఎక్కడైనా ఉందా ఇట్లా..? తెలంగాణలో రైతుల కష్టాసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే ఎవరికీ సాధ్యంకాని పథకాలు తెస్తుండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సాగినీటి గోస తీర్చిండు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నడు. ఇంతకంటే మా రైతులకు ఏం కావాలె. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– డబ్బ రమేశ్రెడ్డి, రైతు (మల్లాపూర్)
నాకు నాలుగు ఎకరాలున్నది. మా నాన్న నుంచి వచ్చిన భూమినే సాగు చేసుకుంటున్న. నేను క్రాప్ లోన్ రూ.99వేలు తీసుకున్న. ఇప్పుడు మాఫీ చేస్తమన్నరు. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాకముందు ఎవుసం ఆగమాగం ఉంటుండె. రైతు అంటేనే ఈసడించుకున్నరు. సాగునీరు, కరంటు, ఎరువుల కోసం పడ్డ బాధలు చెప్పరాదు. మళ్ల పంటల దిక్కు చూడద్దనుకున్నం. ఉన్న భూమి అమ్ముకుని ఎక్కడన్న బతుకు దెరువు చూసుకోవాలనిపించింది. కానీ, తెలంగాణ వచ్చినంక ఎవుసం మంచిగైంది. కేసీఆర్ను నమ్మి వెంట నడిచినం. బాగుపడ్డం. ఇవాళ ఇంకో పదెకరాలుంటే బాగుండనిపిస్తుంది. కొందామంటే ధర అందకుంటా పెరిగింది. కేసీఆర్ సార్ జెయ్యవట్టి మారైతులు మంచిగున్నరు. ఆయనకే మళ్లీ పట్టం కడుతం.
– జంగు ఆంజనేయులు, లింగంపల్లి (వేములవాడ మండలం)
తెలంగాణ వచ్చిన తర్వాతమే మా బతుకులు బాగుపడ్డయి. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉన్నది. సీఎం కేసీఆర్ రైతులకు ఏది కావాలో అది చేస్తండు. మూలకుపడ్డ ఎవుసాన్ని బాగు చేసిండు. సాగునీరు, కరెంట్కు గోస లేకుంట చేసిండు. రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తండు. టైంకు ఎరువులు, విత్తనాలు ఇస్తండు. 2014 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు పంట రుణమాఫీ చేసిండు. ఇప్పుడు మళ్ల రుణమాఫీ కూడా చేస్తనని చెప్పిండు. నాటి ప్రభుత్వాలు రైతుల కోసం ఏ ఒక్క పని చేయలె. మేమంతా సీఎం కేసీఆర్ను నమ్ముతున్నం. సారే మళ్లీ సీఎం అయితడు.
– కాసం బ్రహ్మారెడ్డి, రైతు (ముంజంపల్లి)
రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడమంటే సామాన్య విషయం కాదు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టే రైతులకు మర్చిపోలేని సాయం చేస్తుండు. మాఫీ చేసుడంటే నిజంగా రైతులకు పండుగ రోజే. నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎవుసం బాగుపడ్డది. సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయాలతో రైతులకు మంచి మేలైతంది. ఇయ్యాల ఇన్ని పంటలు పండుతున్నాయంటే, ఊరూరా రైతులు సంబురంగా ఉన్నరంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమే. అందుకే మా రైతులకు సీఎం కేసీఆర్పై ఎనలేని అభిమానం ఉంది. రైతుల తరపున సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్న.
– రామంచ గోపాల్రెడ్డి, ఆర్బీఎస్ మానకొండూర్ కన్వీనర్
బీఆర్ఎస్ ప్రభుత్వం నిజమైన రైతు ప్రభుత్వం. రైతుబంధు కింద టైంకు పెట్టుబడి సాయం ఇస్తున్నట్టుగానే రుణమాఫీ చేస్తూ ఆదుకుంటున్న నిజమైన దేవుడు కేసీఆర్. మా కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు తెస్తండు. రైతు బీమా, ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తండు. ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చేసిండు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం చాలా గొప్ప విషయం. కేసీఆర్ను రైతులు ఎన్నటికీ మర్చిపోరు. సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన, మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
-గూడూరి స్వామిరెడ్డి, జీకే రైతు మిత్ర సమన్వయ సమితి (రాష్ట్ర అధ్యక్షుడు)
కేసీఆర్ సార్ మా రైతుల కోసం అన్నీ చేస్తండు. మంచి మంచి పథకాలు తెస్తండు. గతంలో సాగునీటికి, కరెంటు కోసం ఎంతో గోసపడ్డం. ఎరువులు, విత్తనాల కోసం ఎన్నో బాధలు పడ్డం. ఆ బాధలు ఎవరికీ రావద్దు. గప్పుడే మన తెలంగాణ మనకు వచ్చి కేసీఆర్ సార్ సీఎం అయిండు. ఎవుసాన్ని బాగు చేసిండు. ఇప్పుడు పంటల సాగు కోసం బ్యాంకుల తీసుకున్న రుణాలు మాఫీ చేస్తండు. చానా సంతోషంగ ఉంది. మా వెన్నంటి ఉంటున్న కేసీఆర్ సారు వెంటే మేమంతా ఉంటం. వచ్చే ఎన్నికల్లో అండగా ఉంటం. మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవుడు ఖాయం.
-పంజాల సమ్మయ్యగౌడ్, రైతు (హుజూరాబాద్)