నాటి పాలనలో తెలంగాణలోని కులవృత్తులు ధ్వంసమయ్యాయి. చేతివృత్తిదారులంతా ఉన్న ఊళ్లను వదిలి వలసబాటపట్టినా నాటి ప్రభుత్వాలు చోద్యం చూశాయి. కానీ, స్వరాష్ట్రంలో కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు పెద్దపీట వేస్తూ, అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారు. తాజాగా, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా కల్లుగీత వృత్తిదారులకు ‘రైతు బీమా’ మాదిరిగా ‘గీత కార్మికుల బీమా’ను ప్రకటించడంపై గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి తమకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారం పది రోజుల్లోనే పరిహారం ఖాతాల్లో జమయ్యేలా బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారని, ఇది తమ కుటుంబాలకు భరోసానిస్తుందని చెప్పారు.
– చొప్పదండి/ రామడుగు, మే 3
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
మా జీవనాధారం కులవృత్తి. ఎండనకా.. వాననకా తాటి చెట్లు ఎక్కుతం. కల్లు గీసి అమ్ముకొని బతుకుతం. చెట్లెక్కుడు మస్తు కష్టం. ప్రాణాలు అరచేతుల పెట్టుకొని తాటి చెట్లు ఎకుతుంటం. ఎంతో మంది చెట్లపై నుంచి పడి చనిపోయిన్రు. కొందరికి కాళ్లురెక్కలిరిగినయ్. అయినా, నాడు ఎవరూ పట్టించుకోలె. మా కుటుంబాలకు భరోసా ఇవ్వలె. గతంలో ప్రమాద బీమా రూ.రెండు లక్షలు ఉండె. అది కూడా ఆఫీసులు చుట్టూ రోజుల తరబడి తిరిగితేగానీ రాకపోతుండె. కానీ, కేసీఆర్ సార్ గెలిచినంక మమ్మల్ని పట్టించుకున్నడు. చెట్లపన్ను రద్దు చేసిండు. 50 ఏండ్లకే పింఛన్లిస్తున్నడు. ప్రమాద బీమా రూ.5 లక్షలు చేసిండు. అవి రావడానికి ఆలస్యమైతందని ఇప్పుడు రైతు బీమా లెక్క మాకు ‘గీతకార్మికుల బీమా’ను ప్రకటించిండు. మా కుటుంబాలకు భరోసానిచ్చిండు. చెట్టెక్కినప్పుడు ఎవరైనా చనిపోతే ఆఫీసుల చుట్టూ తిరుగుడు లేకుంట వారం పది రోజుల్ల బీమా డబ్బులు ఖాతాల పడుతయ్. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయమే. మాకు అన్ని రకాలు అండగా ఉన్న సీఎం కేసీఆర్ను మేం మరువం. మా గౌండ్లోల్లందరం రుణపడి ఉంటం.
– పూదరి వెంకటేశం, గీత కార్మికుడు (చొప్పదండి)
చొప్పదండి/ రామడుగు, మే 3: కల్లు గీసే సమయంలో చెట్ల పైనుంచి పడి ఎంతో మంది గీత కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంటి పెద్దను కోల్పోయి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రమాదాల బారినపడి శాశ్వత అంగవైకల్యంతో ఎంతో మంది జీవితాలు దుర్భరంగా మారాయి. అలాగే, చెట్లు ఎక్కి దిగి చిన్న వయసులోనే ఎంతో మంది నడుములు వంగిపోయాయి. అయినా, నాటి ప్రభుత్వాలు చోద్యం చూశాయి. చనిపోతే 2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. అంతే తప్ప కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కులస్తులను ఒక భరోసా ఇవ్వలేకపోయాయి. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి గీత కార్మికులు డిమాండ్ చేస్తున్న తాటి, ఈత చెట్లపై పన్నును రద్దు చేశారు.
వైన్స్లతో ఉపాధి తగ్గిపోగా, మద్యం వ్యాపారం చేసుకునేందుకు కూడా గౌడన్నలకు 15 శాతం రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు. 50ఏండ్లు దాటిన వారికి 206 ఆసరా పింఛన్ ఇస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను విడుదల చేశారు. అలాగే ఆ ఎక్స్గ్రేషియాను 5లక్షలకు పెంచారు. అలాగే ‘హరితహారం’ కింద వనాల పెంపును ప్రోత్సహించారు. లక్షలాది ఈత, తాటి మొక్కలను నాటించారు. పలుచోట్ల గిరక తాటిచెట్లను కూడా నాటించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ‘రైతుబీమా’ తరహాలో ‘గీతకార్మికుల బీమా’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీతకార్మికుల కుటుంబాలకు 5 లక్షల బీమా సాయాన్ని వారం పది రోజుల్లోగా నామినీ అకౌంట్లో జమ చేయనున్నారు. అందుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను సీఎం కేసీఆర్ మంగళవారమే ఆదేశించారు.
కుటుంబాలకు భరోసా
గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడి మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం, బాధిత కుటుంబానికి 5 లక్షల వరకు ఎక్స్గ్రేషియా అందిస్తున్నది. అయితే, ఈ ఎక్స్గ్రేషియా పొందేందుకు బాధిత కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఎక్కడో మారుమూల గ్రామంలో సంఘటనా స్థలంలో ఎఫ్ఐఆర్ మొదలుకొని.. సాక్షులు, డెత్ సర్టిఫికెట్, ఇతర పేపర్ వర్క్ మొత్తం ఓ ఫైల్గా సంబంధిత రాష్ట్రశాఖకు చేరేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. చెక్కుల రూపంలో ఇచ్చే పరిహారం డబ్బులను విత్డ్రా చేసుకొనేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబపెద్ద చనిపోయిన బాధ ఒక ఎత్తయితే.. ఆ డబ్బుల కోసం తిరగడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో కొర్రీలేమీ లేకుండా రైతు బీమా తరహాలోనే ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయనున్నారు. దీంతో ఆపద సమయాల్లో కుటుంబాలకు భరోసా దొరకనున్నది.
బీమాను ప్రకటించడం హర్షనీయం
రైతుబీమా తరహాలో గీత కార్మికులకు బీమాను ప్రకటించడం హర్షనీయం. ఇది గీత వృత్తిని నమ్మకొని బతికే వారికి భరోసా ఇచ్చినట్లవుతుంది. అలాగే నీరా కేఫ్ను ప్రారంభించడం సంతోషకరం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మా ప్రత్యేక ధన్యవాదాలు.
– దుర్గపు రవీందర్ గౌడ్, జగిత్యాల జిల్లా గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా)అధ్యక్షుడు
మేలు జరుగుతది
రైతు బీమా లెక్క గీతన్నకు బీమా పథకం మా కుటుంబాలకు భరోసాను ఇస్తున్నది. ఈ పథకం ద్వారా గీత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. దురదృష్టవశాత్తూ చనిపోతే వారంలోపే బీమా డబ్బు బ్యాంకు ఖాతాలో వేస్తమని ప్రభుత్వం చెప్పింది. కేసీఆర్ చేపడుతున్న పథకాల వల్ల బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతున్నది.
– కాసారపు శ్రీనివాస్గౌడ్, జగిత్యాల
మాకు అండగా ప్రభుత్వం
మాకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటున్నది. తాటిచెట్లను ఎక్కుతూ ప్రమాదాల బారిన పడుతున్న గీత కార్మిక కుటుంబాలకు భరోసానిస్తున్నది. చెట్లపై నుంచి పడి మృతి చెందిన వారికి గత ప్రభుత్వాలు 2లక్షలు అందిస్తుండె. కానీ, ఇప్పుడు రైతు బీమా లెక్క 5లక్షలు ఇస్తమన్నడు.
– కాసారపు సురేశ్ గౌడ్, జగిత్యాల
మా అదృష్టం
కేసీఆర్ ప్రభుత్వం అన్ని మంచి పనులే చేస్తున్నది. కులవృత్తులకు అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆసరా అయితుండు. గీత కార్మికులు చెట్లపై నుంచి పడి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 5లక్షలు ఇస్తమన్నడు. గత ప్రభుత్వాలు కేసీఆర్ లెక్క పట్టించుకోలె. నాడు సచ్చిపోతే ఇచ్చే 2లక్షల ఎక్స్గ్రేషియా కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేటోళ్లం. ఇప్పుడు మా కుటుంబాలకు అండగా ఉండడం అదృష్టం.
– కరబూజ వీరమల్లు గౌడ్, జగిత్యాల
కేసీఆర్కు రుణపడి ఉంటం
గతంల గీత కార్మికులను ఎవరూ పట్టించుకోలె. మేము ఎండనక, వాననక తాటి, ఈత చెట్లు ఎక్కుతం. తెలంగాణ రాక ముందు మాకు ప్రమాద బీమా రెండు లక్షలు ఉండె. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.5 లక్షలు అయింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బీమా పైసలు త్వరగా రాక ఇబ్బందులు పడ్డం. సీఎం కేసీఆర్ దీనిని గుర్తించిండు. అందుకే రైతు బీమా లెక్క మాకు బీమా ఇస్తనని ప్రకటించిండు. వారం పది రోజుల్లోనే బీమా సాయం అకౌంట్లలో జమయ్యేలా చూస్తనన్నడు. మా గీత కార్మికులందరూ కేసీఆర్ సార్ కు రుణపడి ఉంటరు.
-బొడిగె శంకర్, గీత కార్మికుడు చొప్పదండి
గౌడ్లకు నిజమైన బంధువు
గీత కార్మికులను గత ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదు. నాడు గీత కార్మికుడు గాయాలపాలైతే ప్రభుత్వం అందించే సాయం కోసం ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి ఉండేది. ఆ కుటుంబాలకు పెద్ద ఇబ్బంది అయ్యేది. కానీ, సీఎం కేసీఆర్ గీతకార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు రైతు బీమా తరహాలో బీమా అందిస్తామని ప్రకటించి, గౌడ కుటుంబ సభ్యులకు గౌడ ‘బంధువు’ అయ్యారు. సీఎం నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. గీత కార్మికలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. భవిష్యత్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి గీతకార్మిక లోకం అండగా ఉంటుంది.
– చిదుగు గోవర్ధన్గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ సారుది గొప్పమనసు
కేసీఆర్ సార్ అచ్చినంక మాకు సానా మంచిగ చేత్తుండు. వైన్షాపుళ్ల రిజర్వేషన్ తీసుకువచ్చిండు. గట్లనే చెట్ల పన్నులను కూడా తీసేసిండు. 50ఏండ్లకే మా కులపోళ్లకు పింఛన్ ఇత్తండు. చెట్లెక్కెటప్పుడు మాకేమన్న అయితే ఏట్లా అనే రంది ఉండె. గదిగూడా గిప్పుడు లేదు. మాకేమైనా అయితే రైతుల లెక్క బీమా ఇత్తనన్నడు. రైతులకు చేసిన మేలు మాకు చేత్తుండు. గతంల మా గురించి ఎవరు పట్టించుకోలె. కేసీఆర్ సార్ది గొప్ప మనసు.
– ముంజాల బాపుగౌడ్, గీత కార్మికుడు (కొలనూర్)
ఇబ్బందులు తప్పుతయ్
గీతన్నకు బీమా పథకం వల్ల గౌడ కులస్తులు నిర్భయంగా చెట్లను ఎక్కే పరిస్థితి ఉంటుంది. గతంలోని ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు ఏండ్లపాటు తింపినయ్. కానీ, కేసీఆర్ చేపట్టిన పథకం వల్ల అలాంటి ఇబ్బందులు తప్పుతయ్. ప్రమాదవశాత్తూ ఎవరైనా చెట్టెక్కుతూ చనిపోతే వెంటనే బీమా సాయం అందుతుంది. సీఎం కేసీఆర్ గౌడ కులస్తులకు చెట్ల పన్ను మాఫీ చేసిండు. వైన్స్ షాప్ల్లో కూడా 15 శాతం రిజర్వేషన్ కల్పించిండు. ఇన్ని రకాలు ప్రోత్సాహం అందిస్తున్న కేసీఆర్కు గౌడ కులస్తులు రుణపడి ఉంటరు.
– గొల్లపల్లి మల్లేశంగౌడ్, జగిత్యాల
ఎంతో మేలు చేస్తున్నడు
సీఎం కేసీఆర్ మా గౌడ కులస్తులకు ఎంతో మేలు చేస్తున్నడు. మా కుటుంబాలకు కూడా భరోసానిస్తున్నడు. రైతుల లెక్క మాకు కూడా బీమా పెట్టడం చాలా మంచి ఆలోచన. ఆకాశానికి ఎక్కి దిగే సమయాల్లో ఎందరో గౌడన్నలు జీవిడిసిన్రు. ఇంటికి అచ్చేదాక ఇండ్లల్లోళ్లు కోటొక్క దేవుళ్లకు మొక్కుతూ ఎదురుచూస్తుంటరు. గతంల ఏ ఆసరా లేక ఇబ్బందులు పడ్డం. ఇప్పుడు కేసీఆర్ సారు అన్ని విధాలా ఆసరైతుండు.
– తోట తిరుపతిగౌడ్, గౌడ సంఘం పెద్ద మనిషి (కొలనూర్)