పాఠశాలపై గోడలపై అందమైన చిత్రాలు
పాఠ్యాంశాల్లోని బొమ్మలతో ఆర్ట్స్
ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి చొరవతో మారిన స్కూల్
గోడలపై తంగేడు పుష్పం, పాలపిట్ట, జింక, జమ్మిచెట్టు వంటి రాష్ట్ర చిహ్నాలు, ఇంకా జిరాఫీ, ఏనుగు, సింహం ఆకృతులు, కూరగాయలు, రైలు బండి, ఆంగ్ల అక్షరమాల చిత్రాలు చూసి ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటున్నారా..? కానే కాదు, ధర్మారం మండలం పైడిచింతలపల్లి బడి. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంనాయక్ చొరవతో స్కూల్ కొత్త రూపు సంతరించుకున్నది. పిల్లల్లో విద్యపై ఆసక్తిని.. అభ్యసనా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తీర్చిదిద్దగా, ఎంతో ముచ్చటగొలుపుతున్నది. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడమే కాదు హాజరుశాతాన్ని పెంచుతూ, అభ్యసనానికి దోహదపడున్నది.
ధర్మారం, జూన్ 19: పైడిచింతలపల్లి సర్కారు పాఠశాల ఒకప్పుడు అరకొర వసతులతో నడిచేది. శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనాన్ని కూల్చివేయగా, ప్రస్తుతం ఒక్క గది మాత్రమే ఉంది. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు టీచర్లు, ఒక విద్యా వలంటీర్ పనిచేస్తున్నారు. ఈ బడిని మోడల్గా తీర్చిదిద్దాలని ఎంపీపీ కరుణశ్రీ, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి భావించారు. అందుకు మండల పరిషత్ కార్యాలయం నుంచి 75 వేలు కేటాయించారు. ఇటీవల కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా ఆర్టిస్ట్లను రప్పించి చిత్రాలు వేయించారు. పాఠశాల బయట, లోపలి గోడలతోపాటు భవనంపై కప్పుకు సైతం అందమైన బొమ్మలు వేయించారు. ఆంగ్లం అక్షరమాల, అంకెలు, పదాలు, రాష్ట్ర చిహ్నాలు, జంతువుల బొమ్మలు చిత్రీకరించారు. ఇవి విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇంకా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో బాల బాలికలకు వేర్వేరుగా బాత్రూంలు నిర్మించారు. కాగా, ఇటీవల పాఠశాలను సందర్శించిన మండల ప్రత్యేకాధికారి డీఆర్డీవో శ్రీధర్, ఇతర అధికారులు బొమ్మలు బాగున్నాయని కితాబిచ్చారు.