పాడి కౌశిక్రెడ్డి హుజూరాబాద్ ప్రజల మనసును గెలిచారు. తాజా ఎన్నికల్లో బడా నేతను ఢీకొట్టి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్పై ఏకంగా 16,873 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
– హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 5
హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 5 : హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం 2,49,558 ఓట్లు ఉండగా, అందులో 2,09,311 ఓట్లు పోలయ్యాయి. పాడి కౌశిక్రెడ్డికి 80,333 ఓట్లు, ఈటల రాజేందర్కు 63,460 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్కు 53,164 ఓట్లు దక్కాయి. అయితే పాడి మొదటి రౌండ్ నుంచే వేల ఓట్లు ఆధిక్యత కనబరిచారు. చివరి 19 రౌండ్ల దాకా మెజార్టీ సాధిస్తూ వచ్చారు. దీనిని ఎవరూ ఊహించలేదు. కొన్ని రోజులుగా ‘నువ్వా నేనా’ అంటూ ప్రచారం సాగగా, కౌశిక్రెడ్డే విజయం సాధించారు. అందుకు చాలా కారణాలున్నాయి. తాను ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కావడం తన ఆశయమని, ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చని చెప్పి ప్రజల మనసు గెలిచారు. అంతేకాదు, టికెట్ రాక ముందు నుంచే నియోజకవర్గవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు కిందిస్థాయి కార్యకర్తలతో మమేకమయ్యారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితోపాటు స్థానిక నాయకులందరినీ కలుపుకొని వెళ్తూ ప్రచారం చేశారు. తన భార్య శాలినీరెడ్డి, కూతురు శ్రీనికారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని వర్గాలకూ చేరువై పాడి విజయం సాధించారు.
ఈటలకు గట్టిదెబ్బ
‘నా హుజూరాబాద్’ అంటూ పదే పదే గొప్పలు చెప్పిన ఈటల, ఈ సారి బొక్కబోర్లా పడ్డారు. ఎక్కడికి వెళ్లినా హుజూరాబాద్ నాకు కన్న తల్లిలాంటిదని, ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పే ఆయన, తీరా ఇక్కడ ప్రజలను విస్మరించారు. ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత మొత్తంగా పత్తా లేకుండా పోయారు. తాజా ఎన్నికల్లో హుజూరాబాద్లో పాడి కౌశిక్రెడ్డి, గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేశారు. కానీ, రెంటికీ చెడ్డ రేవడిలా ఒక్క చోట కూడా గెలువలేకపోయారు. కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్లుగా ఈటల ఓటమికి ఆయన అహం, ఒంటెద్దు పోకడనే కారణమని ప్రజలు చెప్పుకొంటున్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అతి విశ్వాసమే ఆయన కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రజల మనసు గెలిచి, జయకేతనం ఎగురవేశారని చెబుతున్నారు.