ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే, ప్రాణవాయువు కొరతను అధిగమించేందుకు ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుతున్నది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా దవాఖానలో ఎన్జీవో సహకారంతో 500 ఎల్పీఎం (లీటర్ పర్ మినిట్) సామర్థ్యమున్న ప్లాంట్ను నిర్మించింది. ఈ దవాఖానలోని 50, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని 100 పడకలకు ఏకధాటిగా ఆక్సిజన్ అందనుండగా, త్వరలోనే ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధం చేస్తున్నది. నేడో, రేపో కరెంట్ కనెక్షన్ పనులు పూర్తి కాగానే అందుబాటులోకి రానున్నది.
పెద్దపల్లి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా ఏరియా దవాఖానలో మరో అత్యాధునిక వసతి అందుబాటులోకి రాబోతున్నది. కొవి డ్ సమయంలో రోగులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రాణవాయువు కొరతను అందించేందుకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటైంది. ఎన్జీఓ సహకారంతో 90లక్షల వ్యయంతో నెలకొల్పిన ఈ ప్లాంట్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే అందుబాటులోకి రాబోతుండగా, ప్రారంభోత్సవానికి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
కలెక్టర్ చొరవతో ..
కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరత ఏర్పడిం ది. బయటి నుంచి ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి నా సరిపోని పరిస్థితి. ఈ క్రమంలో జిల్లా దవాఖానలోనే ప్లాంట్ నెలకొల్పాలని కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ భావించారు. జిల్లా దవాఖాన , జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ‘డాక్టర్స్ ఫర్ యూ ఇండియా’ ఎన్జీవో సహకారంతో 90లక్షలు మంజూరు చేయించారు. దవాఖాన ఆవరణలో 500 ఎల్పీఎం(లీటర్ ఫర్ మినిట్) ప్లాంట్కు శ్రీకారం చుట్టగా, తాజాగా రెడీ అయిం ది. యంత్రాల బిగింపు సైతం పూర్తయింది.
ఆక్సిజన్ కొరతకు చెక్..
జిల్లా దవాఖాన ఆవరణలో ఆక్సిజన్ ప్లాంటు ని ర్మాణం పూర్తయింది. ట్రాన్స్ఫార్మర్ పనులు త్వరలోనే పూర్తి కానుండగా, ఆ వెంటే ఆక్సిజన్ అందుబాటులోకి రాబోతున్నది. జిల్లా దవాఖానలో ప్రధానంగా ఏ-టైప్, బీ-టైప్, బల్క్ సిలిండర్లను ఉపయోగిస్తుంటారు. అయితే సర్జరీలు, సీరియస్ కండిషన్లో ఉన్న రోగులకు ఆక్సిజన్ అవసరాలు ఉంటాయి. ప్రస్తుతం వారానికి మూడు వరకు బల్క్ సిలిండర్లు, నాలుగు వరకు ఏ-టైప్ సిలిండర్లు, 10వరకు బీ-టైప్ సిలిండర్లు అవసరమవుతాయి. వీటికి గాను బల్క్ సిలిండర్ ఒక్కోదానికి దాదాపుగా 500 నుంచి 600, ఏ, బీ టైప్ సిలిండర్ ఒక్క దానికి 350 దాకా ఖర్చవుతుంది. అదే కరోనా టైంలో అయితే రోజుకు 20 నుంచి 30 నుంచి సిలిండర్లు తెప్పించినా సరిపోని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ ఈ ఆక్సిజన్ ప్లాంటుతో దవాఖానలో రోజువారీ అవసరాలు తీరి, వ్యయ భారం తప్పనున్నది.
నేరుగా రోగుల బెడ్లకే ఆక్సిజన్ సరఫరా..
500 ఎల్పీఎం(లీటర్ ఫర్ మినిట్) సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంట్తో జిల్లా దవాఖానలోని 50పడకలు, ఇటీవల ప్రారంభమైన మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని 100పడకలకు ఏకధాటిగా ప్రాణవాయువును అందించవచ్చు. ఈ మేరకు ప్లాంట్ నుంచి బెడ్లకు పైప్లైన్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. రోగిని ఎక్కడికి కదిలించకుండానే అక్కడికక్కడే ఏర్పాటు చేసిన పాయింట్ల ద్వారా ఆక్సిజన్ అందుతుంది.
పనులు పూర్తికాగానే ప్రారంభం..
జిల్లా దవాఖానకు వచ్చే రోగులకు ఆక్సిజన్ ఇబ్బందులు పూర్తిగా తప్పనున్నాయి. ప్లాంటు నిర్మా ణం పూర్తయింది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్పెషల్ ఫండ్ మంజూరు చేశారు. విద్యుత్ కనెక్షన్ పనులు పూర్తికాగానే అందుబాటులోకి తీసుకువస్తాం.
–కొండ శ్రీధర్, డీసీహెచ్ఎస్ (పెద్దపల్లి)
మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం..
జిల్లా దవాఖానలో క్రమంగా వసతి సౌకర్యాలు, సేవలు పెరుగుతున్నాయి. దవాఖానకు ప్రతిరోజూ వందలాది మంది రోగులు వస్తుంటారు. గతంలో ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరారు దవాఖానలు కార్పొరేట్కు దీటుగా తయారయ్యాయి. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ కూడా అందుబాటులోకి రానున్నది.
– శౌరయ్య, దవాఖాన, సూపరింటెండెంట్