ఓదెల, జనవరి 30: అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరుకుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. పొత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, స్థానికుల వివరాల ప్రకారం.. ఓదెల మండలం గోపరపల్లి గ్రామానికి చెందిన దాసరి వంశీకృష్ణరెడ్డి(20), కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన జీల మహేశ్(18), సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లికి చెందిన పసిడ్ల సంజయ్ (22) ఈ ముగ్గురు స్నేహితులు. సోమవారం రాత్రి సంజయ్ తన బైక్పై పెగడపల్లిలోని స్నేహితుడు మహేశ్ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి వీరిద్దరూ కలిసి మరో స్నేహితుడు వంశీకృష్ణరెడ్డి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే బైక్పై కొలనూర్ వైపు బయలు దేరారు.
బైక్పై అతివేగంగా వెళ్తున్న వీరు.. రాత్రి 9.30గంటల ప్రాంతంలో గోపరపల్లి శివారులోని మూలమలుపు వద్ద అదుపుతప్పి పడ్డారు. రోడ్డు పక్కన బండరాయి, చెట్టును బైక్ ఢీ కొనగా, ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా, మార్గమధ్యలో వంశీకృష్ణ రెడ్డి మృతిచెందాడు. మహేశ్ కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశాడు. సంజయ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు..? ఏం పనిమీద వెళ్తున్నారో వివరాలు తెలియరాలేదు. వంశీకృష్ణరెడ్డి సుల్తానాబాద్లో ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, మహేశ్ హన్మకొండలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మహేశ్ తల్లిదండ్రులకు ఒకడే కొడుకు కావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వంశీకృష్ణరెడ్డి తండ్రి నర్సింహరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజయ్పై అతి వేగం, అజాగ్రత్తగా వాహనం నడిపినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.