Rajanna temple | వేములవాడ, జూలై 7 : వేములవాడ రాజన్న ఆలయంలో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాజన్న ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎవైనా సరే.. వాటిని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులను భర్తీ చేయాలని, ముందుగా స్థానికులకు అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న ఆలయంలోపలు విభాగాల్లో ఖాళీలున్నాయని పేర్కొంటూ గతంలో ఉన్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఇంటర్వూలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గతంలోస్థానికులకు ఇంటర్వూలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తుతం పక్కన పెట్టి, పలువురు మంత్రుల సిఫారసులతో భర్తీచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేలాది మంది నిరుద్యగ యువతీ యువకులున్నారని, వారికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న, స్థానికులను కాదని ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో ఇతరులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలైన, కాంట్రాక్ట్ ఉద్యోగాలైన భర్తీ విధానంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.
ఆలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని పత్రిక ప్రకటన ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అర్హత ఉన్న వారిని కాదని దొడ్డి దారిన భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల అన్ని అర్హతలున్న నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి అవకాశాలు కొల్పోతారని పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే మంత్రుల సిఫారసులతో భర్తీ జరిగిన ఔట్ సోర్సింగ్ పోస్టులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇలా అడ్డదారుల్లో పోస్టులను భర్తీచేయడంతోపాటుగా స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు అన్యాయం జరుగుతుంటే అడ్డుకోవల్సిన బాధ్యత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు లేదా అని ప్రశ్నించారు. నిజంగా జిల్లా యువతీ యువకులకు న్యాయం జరగాలన్న చిత్తశుద్ధి అది శ్రీనివాస్ కు ఉంటే..పూర్తి స్థాయి విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు.