సీఎం కేసీఆర్ మా కుటుంబాలకు పెద్ద దిక్కులెక్క నిలుస్తున్నారు. ధూప దీప నైవేద్యం (డీడీఎన్) కింద వచ్చే నిధులను గతంలో రూ.2500 నుంచి రూ.ఆరు వేలకు, ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత ఇక్కడి ఆలయాలను చూస్తే పాలన ఎలా ఉందో తెలుస్తుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం రోజురోజుకూ అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నది. ఆయన రాజ్యపాలనా దక్షతకు ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు.
– పాటిమెట్ల శివప్రసాద్, అర్చకుడు, కొత్తపల్లి
కమాన్చౌరస్తా, ఆగస్టు 29 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం అర్చకుల గౌరవ భృతి కింద ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాజాగా, ఉత్తర్వులు విడుదల చేసింది. 2015 జనవరి 9 నుంచి ధూప, దీప, నైవేద్యాలకు రూ.2 వేలు, అర్చకులకు రూ.4 వేల చొప్పున అందిస్తుండగా, తాజాగా ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం జీవో నెంబర్ 128ను విడుదల చేయడంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డీడీఎన్ కింద ప్రభుత్వం రూ.10 వేలు మంజూరు చేస్తున్న క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 848 మంది అర్చకులకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో డీడీఎన్ కింద కరీంనగర్ జిల్లాలో 189 మంది, జగిత్యాలలో 220 మంది, పెద్దపల్లిలో 104 మంది, రాజన్న సిరిసిల్లలో 119 మంది ప్రయోజనం పొందుతుండగా, ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 216 మంది అర్చకులు, నూతన ఆలయాలకు ఈ పథకం వర్తించనుంది.
ప్రత్యేక రాష్ట్రంలో 3645 ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. వాటితోపాటు ప్రస్తుతం 2796 ఆలయాల్లో డీడీఎన్ అమలుకు సీఎం కేసీఆర్ పక్రటించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇంతకు ముందున్న ఏ పార్టీకానీ, నాయకుడు కానీ బ్రాహ్మణుల బాగు కోసం ఏనాడూ ఆలోచించలేదు. కానీ, బ్రాహ్మణ పక్షపాతిగా, అన్ని కులాలతో సమానంగా సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఆయన దినదినాభివృద్ధి చెందేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం.
– డాక్టర్ ఆవునూరి నాగరాజు శర్మ, ఈదులగట్టెపెల్లి, మానకొండూర్
గతంలో అర్చకులకు రూ.2500 ఉంటే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అర్చకులకు ధూప, దీప నైవేద్యాల కింద రూ.6000లు అందేలా కృషి చేశారు. ఆయనే ఇప్పుడున్న పరిస్థితులను గుర్తించి రూ.10 వేలకు పెంచారు. ఇది చాలా సంతోసించదగ్గ విషయం. బ్రాహ్మణులు కేసీఆర్ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ, రాష్ర్టాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలుపుతారు. ప్రతి బ్రాహ్మణుడు హర్షించదగ్గ విషయం.
– గోవర్ధన యజిత్