వేములవాడ, మే 17: ప్రతి ప్రసవం సర్కారు దవాఖానలోనే జరగాలని, ఇందుకు ఏఎన్ఎంలు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్తున్న డయాలసిస్ సెంటర్, ప్రత్యేక పిల్లల వార్డు, ల్యాబ్లను బుధవారం ఆయన పరిశీలించి అనంతరం హన్మాజీపేట ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్య సిబ్బంది, వైద్యలతో సమావేశమై మాట్లాడారు. కాన్పులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరగాలని ఆదేశిస్తున్నా, కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు బాగాలేదని మండిపడ్డారు. నూటికి నూరుశాతం కాన్పు లు గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరగాలని, ఇం దుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఎన్ఎంల పనితీరు మార్చుకోకుంటే తగిన చర్య లు తప్పవని హెచ్చరించారు.
ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎన్ని కాన్పులు ప్రైవేట్ హాస్పిటళ్లలో జరుగుతున్నాయో..? ప్రత్యేక దృష్టి సారించి వివరాలు నమోదు చేసుకొని, వీటిపై సమీక్ష జరుపుకోవాలని సూచించారు. ఇకపై వేములవాడ, చందుర్తి, కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా రాత్రి వేళలో కూడా స్త్రీ వైద్య నిపుణురాలు అందుబాటులో ఉంటుందని, వీలైనంత ఎకువ వరకు కాన్పులు జరిగేలా వైద్యాధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో జరిగిన కాన్పుల వివరాలు సమగ్రంగా లేకపోవడంతో హన్మాజీపేట పీహెచ్సీ వైద్యాధికారి దివ్య పై కలెక్టర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సమగ్ర వివరాలతో గురువా రం హాజరు కావాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్వో ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని కూడా ఆదేశించారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్తున్న నవజాత శిశువుల ప్రత్యేక కేంద్రంతో పాటు, డయాలసిస్ సెంటర్ను జూన్ 2లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా కార్యాచరణ చేపట్టాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాధులను అరికట్టేందుకు డ్రై డేను పాటిస్తూ గతంలో రిస్ ఉన్న ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి ఆవుల సుమన్ మోహన్ రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ రజిత తదితరులు ఉన్నారు.