రైతాంగం ఆలోచన మారుతున్నది. ఎప్పుడూ ఒకే పంట వేస్తే లాభం లేదని ఇతర పంటల వైపు దృష్టి పెడుతున్నది. అనాదిగా వస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి పలుకుతూ తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు ఉన్న ఉద్యాన సాగుకు శ్రీకారం చుడుతున్నది. గత ప్రభుత్వాల పట్టింపులేక దశాబ్దాలుగా ఆగమైన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పండుగలా మార్చడం, ఇంకా కరువుదీరా కరెంటు, పుష్కలమైన కాళేశ్వర జలాలు ఇస్తుండడంతో పండ్ల తోటలు సాగుచేస్తున్నది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1274 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయగా, ఇటు కొత్తగా తైవాన్ జామ, డ్రాగన్ ఫ్రూట్స్, బొప్పాయి, కస్టర్డ్ ఆపిల్ వేస్తున్నది. ఈ కొత్త మార్పుతో ఒకప్పుడు జిల్లాలో కేవలం 500 ఎకరాల్లో మాత్రమే ఉన్న ఉద్యానవన సాగు ఇప్పుడు 3 వేల ఎకరాలకు పెరుగగా, పంటల నిర్వహణకు ప్రభుత్వం నిధులు, సబ్సిడీలు ఇస్తుండడంతో కర్షకలోకం రెట్టించిన ఉత్సాహంతో అడుగు ముందుకేస్తున్నది.
– రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ): నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్, పుష్కలంగా కాళేశ్వర జలాల రాకతో ఇతర పంటల వైపు అన్నదాత అడుగు పడుతున్నది. రైతుల ఆదాయం పెంచేందుకు లాభాదాయక పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుండడంతో నాడు 500 ఎకరాలకే పరిమితమైన పండ్ల తోటల సాగు, నేడు 3వేల ఎకరాలకు పెరిగింది. నూతన పంటల సాగులో పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సర్కారు ప్రోత్సాహంతో పెరుగుతున్న ఆసక్తి..
సమైక్య పాలనలో సాగునీటి ఇబ్బందులతో వ్యవసాయ రంగం కుదేలైంది. ఉపాధి కరువై యువత దుబాయికి వలస బాటపట్టగా, రైతులు అడ్డామీది కూలీలుగా మారారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో సేద్యం పండుగలా మారింది. ముఖ్యంగా కాళేశ్వర ప్రాజెక్టు నిర్మించడంతో నీటి గోస తీరింది. 24గంటల ఉచితకరెంటు, పంట పెట్టుబడి రైతుబంధుతో వ్యవసాయానికి పూర్వవైభవం వచ్చింది. ఎనిమిదేండ్ల కింద జిల్లాలో 90వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగితే స్వరాష్ట్రంలో 2లక్షల 60వేల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి సైతం మూడింతలు వస్తుంది. వరిపంటపైన ఆధార పడ్డ రైతులకు ప్రకృతి వైపరీత్యాలు శరాఘాతమయ్యాయి.
ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టాలను తెచ్చిపెట్టాయి. మరోవైపు ధాన్యానికి మార్కెట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పాం తోటల సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1600 ఎకరాల్లో సాగు చేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటికే 1274 ఎకరాల్లో సాగైంది. ఆయిల్ పాం తోటలసాగుతో వచ్చే లాభాలపై ఉద్యానవన శాఖ జిల్లాలోని రైతులకు ఈ నెల 16 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది.
పండ్ల తోటల సాగుతో అధిక లాభాలు..
వరి పంటకే పరిమితమైన జిల్లాలోని రైతుల్లో మంచి మార్పు వస్తున్నది. అకాల వర్షాలు, తెగుళ్ల బారిన పడుతున్న వరితో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. అందుకు ప్రభుత్వం ప్రోత్సాహన్ని ఇస్తున్నందున మరింత ఉత్సాహంతో అడుగు ముందుకేస్తున్నారు. మామిడి, తైవాన్ జామ, నిమ్మ, దానిమ్మ, డ్రాగన్ ప్రూట్స్, బొప్పాయి, కమలాపండు, సీతాఫలంలాంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇంకా కొత్త రకం పండ్ల తోటలను సాగు చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. గతంలో 500 ఎకరాలే ఉన్న పండ్ల తోటలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చేయూత వల్ల 3వేల ఎకరాలు పెరిగింది. వీటి విస్తీర్ణం మరింత పెంచడానికి ఉద్యానవన శాఖ చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం జిల్లాలో మామిడి 2416.37 ఎకరాల్లో సాగవుతుండగా, తైవాన్ జామ 83.10 ఎకరాలు, డ్రాగన్ ప్రూట్స్ 57.36, బొప్పాయి 15.14, కస్టర్డ్ ఆపిల్ 38.28, ఆపిల్బెర్ 6.19, ఉసిరి 3.4, అరటి 4, బత్తాయి 5.36, సపోట 4.6 ఎకరాలు మొత్తం 3వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
వచ్చే ఏడాది పదివేల ఎకరాలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పండ్ల తోటలకు మూడేళ్ల పాటు నిర్వహణ కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. సబ్సిడీతో పాటు రైతుకు రైతు బంధు కూడ అందిస్తున్నది. మామిడి తోటల సాగుకు మూడేళ్ల నిర్వహణకు ఎకరాకు రూ. 6560 సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నది. తైవాన్ జామకు రూ.11733, బొప్పాయి రెండేళ్లపాటు నిర్వహణకు రూ.12000, సీతాఫలం ఎకరానికి రూ.10180, డ్రాగన్ ఫ్రూట్ మూడేళ్ల నిర్వహణకు రూ.64000 అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. కాగా వరి పంట కన్నా పండ్ల తోటలు సాగుతో మంచి లాభాలు వస్తున్నట్లు రైతులు చెపుతున్నారు. బొప్పాయి పంట దిగుబడి రాగానే వ్యాపారులే స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ, బెంగుళూరుకు తరలిస్తున్నారు. బొప్పాయి పండ్లు ఔషధాల తయారీకి వినియోగిస్తున్నారు. మిగిలిన పండ్లకు కరీంనగర్, హైదరాబాద్ మార్కెట్లో మంచి గిరాకీ ఉందని రైతులు తెలిపారు.
పండ్లసాగుతోనే లాభముంది..
మాది బోయినిపల్లి మండలం నర్సింగాపూర్. నాకు ఊళ్లే 12ఎకరాల భూమి ఉంది. సమైక్య పాలనలో నీళ్లు గతిలేకుండే. ఎవుసం ఆగమైంది. కానీ కేసీఆర్ సార్ దయవల్ల ఇప్పుడు ఫుల్లుగా నీళ్లున్నయి. ఐదెకరాలల్ల వరేసిన. ఇంకో ఏడెకరాలల్ల కూరగాయలు, బంతి, మక్క పెట్టిన. శివరాత్రి టైంల పూలు అమ్మి, అటు మక్క కంకులు అమ్మి రోజుకు రూ.18వేలు సంపాదించిన. 20గుంటల భూమిలో తైవాన్ జామ మొక్కలు పెట్టిన. రంజాన్ నెలకు మంచి దిగుబడి వచ్చింది. కరీంనగర్లో హోల్సెల్ కిలోకు రూ.65కు అమ్మిన. రిటైల్ రూ.100కు అమ్మిన. రూ. రెండు లక్షల చిల్లర వచ్చినయ్. దుక్కులు దున్ని, అచ్చుగట్టి వరి పండించినా అంత లాభం ఎన్నడూ రాలే. అకాల వర్షాలొస్తే పంట చేతికి రాదు. ఇవన్ని తిప్పలు ఎందకనిపించింది. పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసుకుంటే మంచి లాభాలు ఉంటయని వేసిన. మరో 5 ఎకరాలలో కొత్తరకం పండ్ల తోటలు వేయాలనుకుంటున్న. తెలంగాణ సర్కారు పండ్లతోటలకు మంచి సబ్సిడీ ఇస్తంది. రైతులంతా వరిని వదిలి పెట్టాలి. కొత్త పంటలు సాగు చేస్తే లాభం ఉంటుంది.
– నాంపెల్లి నీలకంఠం రైతు, నర్సింగాపూర్, బోయినిపల్లి మండలం
వరితో గోస పడ్డం..
ఏండ్ల నుంచి వరి పంటేసి గోసపడ్డం. నాడు నీళ్లుంటే కరెంటుండదు. కరెంటుంటే నీళ్లుండదు. తెలంగాణ వచ్చినంక 24గంటల కరెంటు, నీళ్లు మంచిగున్నయ్. అయినా వరి పంట చేతికొత్తదో రాదో అన్న రందే ఉంటంది. ఎకరం భూమిలో ఏడాది కింద తైవాన్ జామ 1600 మొక్కలు తెచ్చిపెట్టిన. ఆరునెలలకే పంట చేతికొచ్చింది. రూ.60వేలు పెట్టుబడి ఎల్లింది. ఇప్పుడొచ్చే పంట లాభమే. వరికున్న కష్టాలు పండ్లతోటలకు ఉండవు. పైగా ఎప్పుడు గిరాకీ ఉంటుంది. పొలం వేసే రైతులు బాగా ఆలోచించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండ్లతోటల సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి.
– తీపి సుధాకర్రెడ్డి, రైతు హన్మాజీపేట, వేములవాడ మండలం