కరీంనగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటా జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కొవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందితో టీంలు ఏర్పాటు చేసి, ఒక్కో టీంతో ప్రతి రోజూ 25 ఇండ్లల్లో సర్వే చేయించాలని ఆదేశించారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారికి హోం ఐసొలేషన్ కిట్ అందజేసి, ప్రతి రోజూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని దవాఖానలో చేర్పించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో రెండో డోస్ 95 శాతంపైగా పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారని, ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం, వైద్యాధికారులను అభినందించారు. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి కొవిడ్ మొదటి డోస్, ఫ్రంట్లైన్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానలు, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ ఓపీ సేవలందించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షల కిట్లు, హోం ఐసొలేషన్ కిట్లు, సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ సౌకర్యంతో కొవిడ్ వార్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానల డాక్టర్లతో రివ్యూ చేయాలని ఆదేశించారు. ప్రజలు మాసులు ధరించేలా పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికొక నోడల్ ఆఫీసర్ను నియమించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ, కరోనాతో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.