విద్యానగర్, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. నగరాల్లోని డివిజన్లు, పట్టణాల్లోని వార్డులు, గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ మేరకు వైద్య బృందాలు వారిని పరీక్షించి, అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేస్తున్నారు. కాగా మంగళవారం కరీంనగర్ జిల్లాలో 6712 మందికి పరీక్షలు చేసి, 1684కి రీడింగ్ అద్దాలు అందించారు. జగిత్యాలలో 7,495 మందికి పరీక్షలు చేసి, 1223 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 5247 మందికి పరీక్షలు చేసి, 803 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4228 మందికి పరీక్షలు చేసి, 932 మందికి రీడింగ్ అద్దాలు ఇచ్చారు.
సీఎం కేసీఆర్ ఏం చేసినా ప్రజల మంచికే చేస్తడు..
నాకు కొద్దిరోజులుగా కండ్లు మసకగా ఉన్నయి. దవాఖానకు పోదామంటే చేతిల పైసలు లేవు. కానీ కేసీఆర్ సారు మా ఊళ్లేనే ఫిరీగ పరీక్షలు చేయిస్తున్నారని తెలిసి ఆనందపడ్డా. ఇయ్యాళ మా ఊరుకు సర్కార్ దవాఖాన డాక్టర్లు వచ్చిన్రు. పెద్ద దవాఖానల్లో లాగ దగ్గరుండి మరీ పరీక్షలు చేసిన్రు. కండ్లలో మసకలను గుర్తించి అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కంటి చూపు బాగా కనిపిస్తంది. పల్లెల్లోని ప్రజల కష్టసుఖాలన్నీ సీఎం కేసీఆర్ సార్ తెలుసు. కంటి సమస్యలతో బాధపడద్దని పల్లెల్లో ఇసోంటి శిబిరాలు పెట్టిండు. కేసీఆర్ సార్ ఏది చేసినా ప్రజల మంచికే చేస్తాడు.
– కాశవత్తిని లక్ష్మీ, గుండంపల్లి గ్రామం(మల్లాపూర్ మండలం)
ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఇంటికి వచ్చి ఇస్తానన్నరు
మాది ఓదెల మండలం కొలనూర్. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో కంప్యూటర్ కోర్స్ చదువుతున్న. ఇంతకు ముందు ప్రైవేట్ దవాఖానలో చూపెట్టుకున్న. పదిహేను వందలు తీసుకొని రీడింగ్ గ్లాసెస్ ఇచ్చిన్రు. కానీ, ఆ అద్దాలు పని చేస్తలేవు. మళ్లీ ఇక్కడ చూపించుకుంటే పాయింట్ పెరిగిందని, ప్రిస్కిప్షిన్ గ్లాసెస్ అవసమని చెప్పిన్రు. దృష్టిలోపాలను నివారించుకోవాలంటే సమతుల ఆహారంతోపాటు ఆకుకూరలు, క్యారెట్ ఎక్కువగా తినాలని చెప్పిన్రు. ప్రిస్కిప్ష్షన్ గ్లాసెస్ ఆర్డర్ చేసి, 15 రోజుల్లో ఇంటికి తీసుకచ్చి ఇస్తామన్నరు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సారుకూ థ్యాంక్స్.
– కొల్లూరి అక్షయ, విద్యార్థిని (పెద్దపల్లి)
కంటి చూపు ఇచ్చిన దేవుడు కేసీఆర్.
నాకు కొడుకులు, బిడ్డలు లేరు. వయస్సుమీద పడ్డది. చానాకాలంగా కండ్లు సక్కగ కనిపిస్తలేవు. చానా ఇబ్బందయితంది. దవాఖానకు పోవాలంటే చేతిల పైసలు లేవు. ఎట్లా..? ఏం చేయాలని మస్తు రందివడ్డ. కానీ కేసీఆర్ సారు ఫిరీగ కంటి పరీక్షలు చేయిస్తున్నడని మా ఊరోళ్లు అన్నరు. పాణం లేసివచ్చినట్లయింది. ఇయ్యాళలనే మా ఊళ్లే బడికాడ పెట్టిన క్యాంపులకు పోయిన. డాక్టర్లు చూసిన్రు. అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు మంచిగ కనిపిస్తున్నయి. కంటి చూపు ఇచ్చిన దేవుడు కేసీఆర్. ఆయనకు రుణపడి ఉంట.
– దేవి లక్ష్మి, చెర్లపల్లి(వెల్గటూర్)
పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేసిన్రు..
కంటి వెలుగు చాలా గొప్ప కార్యక్రమం. నాకు ఈ మధ్య కండ్లు సరిగ్గా కనిపించడం లేదు. ఎందుకైనా మంచిదని ఈ రోజు మా జగిత్యాలలలో పెట్టిన శిబిరానికి పోయిన. పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు చాలా ఓపిగ్గా అన్ని టెస్టులు చేశారు. అద్దాలు వాడాలని అన్నారు. అయితే నాకు సరిపడా అద్దాలు అందుబాటులో లేకపోవడంతో ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్లు చెప్పారు. వారంలో ఇంటికి వచ్చి ఇస్తామని అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. – గోలీల సత్యనారాయణ(జగిత్యాల)
కండ్ల బాధ తీరింది..
బతుకుదెరువు కోసం వ్యాన్ కొనుక్కుని నడుపుకుంటున్న. ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి కండ్లు మసకగా ఉండి దగ్గరిచూపు కనిపిస్తలేవు. బండి నడుపుడు చానా ఇబ్బందైతుంది. ఎట్లా అని అనుకున్న. ఇంతలోనే సీఎం కేసీఆర్ సార్ మా ఊళ్లనే కంటి పరీక్షలు చేయిస్నురని ఆశ వర్కర్ వచ్చి చెప్పింది. కేంద్రానికి వచ్చి చూపించుకోవాలని చీటీ ఇచ్చింది. శానా సంతోషమైంది. శిబిరానికి పోయిన. నా కండ్లను పరీక్ష చేసి అద్దాలు ఇచ్చిర్రు. ఇప్పుడు వ్యాన్ నడుపుతుంటే రోడ్డు మంచిగ కనిపిస్తంది. నా కండ్ల బాధ తీరింది. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు తెల్పుతున్న.
– వీర్ల సదయ్య, వ్యాన్ డ్రైవర్, కొలనూర్(ఓదెల)
దగ్గరి సూపు కనవడకపోయేది..
నేను మా ఊళ్లేనే కిరానా షాప్ నడిపిస్తున్న. ఐదారేండ్ల సంది దగ్గరి సూపు కనవడుతలేదు. పేపర్ సదువుదామన్నా, ఖాతాలెక్కలు రాద్దామన్నా బాగా ఇబ్బంది అయితంది. అపప్పుడప్పుడు తల గూడా నొత్తంది. ప్రైవేట్ దవాఖాన్ల పైసలు బాగా అయితయని పోలె. ఇప్పుడు కంటివెలుగు పెడ్తందని సర్కారు దవాఖాన్ల పని జేసేటోళ్లు ఇంటికి అచ్చి జెప్పిర్రు. పోయి సూపిచ్చుకున్న. ఆధార్ కార్డుతోని పేరు రాసుకొని పరీక్షలు జేసిర్రు. దగ్గరి సూపు సరిగాలేదని కండ్లద్దాలు వడుతయని జెప్పి అప్పుడే ఇచ్చిర్రు. పెట్టుకొని సూసి పేపర్ సదివిన ఇప్పుడు కండ్లు మంచిగ కనవడుతన్నయి. పైసా ఖర్సుకాలె. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ సూడలె. చాలా సంబురంగా ఉన్నది.
– కొమురవెళ్లి సుధాకర్(వీణవంక)
మంచిగ చెక్ చేత్తున్రు..
నేను అటో నడుపుత. ఆర్నెళ్ల సంది కండ్లు మంచిగ కనిపిస్తలేవు. ప్రైవేట్ దవాఖానకు పోదామంటే పైసలు బాగా అయితయని పోలే. సర్కార్ ఉచితంగా కండ్ల పరీక్షలు జేసి అద్దాలు, మందులు ఇస్తుందని తెలిసి ఇక్కడికొచ్చిన. కండ్లు చెక్ జేత్తరంటే ఏమో అనుకున్న. మూడు చోట్ల పరీక్షలు చేసిన్రు. దగ్గరి సూపు సక్కగ లేదని మిషన్ల చూసిన డాక్టరమ్మ చెప్పింది. సార్లు నాకు మంచి అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు చూపు మంచిగా కనపడుతుంది. కేసీఆర్ సార్ మాలాంటి గరీబోళ్లకు మస్తు సాయం జేత్తుండు. నా బిడ్డ పెండ్లికి లక్ష రూపాయల కల్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ సార్ను ఎప్పటికీ మరువం.
– పందిరి కృష్ణ, ఆనంద్నగర్ కాలనీ (కోరుట్ల)
మంచి అద్దాలు ఇచ్చిండ్రు..
చాలా రోజుల సంది కండ్ల సమస్యతో బాధపడుతున్న. ప్రైవేట్ దవాఖానల చూపిచ్చుకుందామంటే చేతిల పైసలు లేవు. వేలకువేలు అయితయని మా దోస్తులు అన్నరు. ఉన్నప్పుడు చూపించుకుందామని అనుకున్న. కానీ ఎప్పుడు వీలుకాలే. కానీ కంటి వెలుగుల మా ఇంటి దగ్గరనే శిబిరం పెట్టిన్రు. పోయి డాక్టర్లకు చూపించుకున్న. చాలా బాగా పరీక్షలు చేశారు. నా సమస్యకు తగ్గట్టు కండ్లద్దాలు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు నా చూపు మెరుగైంది. మంచిగా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది.
– కొండ్ర గంగాధర్, జగిత్యాల