బోయినపల్లి, నవంబర్ 5: ‘కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ అంధకారంలోకి వెళ్లడం ఖాయం. అరవై ఏండ్ల పాలనలోనే ఏం చేయనోళ్లు? ఇప్పుడేం చేస్తరు? అడ్డగోలు హామీలను నమ్మితే గోసపడుతం.. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని వారికి ఇస్తే కుక్కలు చింపిన ఇస్తరు లెక్క చేస్తరు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్కు మద్దతుగా ఆదివారం ఆయన బోయినపల్లి మండలం కొత్తపేటలో ప్రచారం చేశారు. మొదట ప్రచార రథంపై ఉన్న ఆయన అక్కడికి పెద్దసంఖ్యలో వచ్చిన ప్రజలను చూసి ‘అసలుగింత మంది ఉన్నారంటే నేను ఇక్కడికి రాపోదును. నేను ఇల్లంతకుంట వెళ్తున్న.
పక్క నుంచి వెళ్లిపోదామనుకుంటే వేరే దారి లేదు. అందుకే వచ్చిన’ అని చెబుతూ నవ్వులు పూయించారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేశారు. కాంగ్రెస్కు రాష్ర్టాన్ని అప్పగిస్తే రాబందుల రాజ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ హయాంలో నిరంతర విద్యుత్ ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు. రాత్రి సమయంలో రైతులు టార్చిలైట్లు పట్టుకుని పొలాల వద్దకు వెళ్లింది వాస్తవం కాదా? అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చేశారని, 24గంటల కరెంట్, పుష్కలంగా సాగునీరు ఇస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నారని కొనియాడారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు తెచ్చారని ప్రశంసించారు. నాటి.. నేటి పాలన ఎలా ఉన్నదో ప్రజలంతా ఆలోచన చేయాలని, కారు గుర్తుకే ఓటేసి కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నర్సింగాపూర్, వెంకట్రావ్పల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. కోరెం గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకుడు చెన్నాడి అమిత్కుమార్ ఆధ్వర్యంలో 200 మందికిపైగా బీఆర్ఎస్ కార్యకర్తలు మోటార్సైకిళ్లతో ర్యాలీ తీశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, జోగినపల్లి ప్రేమ్సాగర్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, 500 మంది కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.