కార్పొరేషన్, నవంబర్ 10: నగరంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి… వచ్చే ఐదేళ్లలో ఈ అభివృద్ధి మరింత పురోగతి సాధించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన నగరంలోని 36, 53, 54వ డివిజన్లలో ప్రచారం చేశారు. ఆయా డివిజన్లలో మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి గంగులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమైక్య పాలనలో తాగునీటి కోసం ఎంతో గోసపడ్డామని తెలిపారు. తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్ధాలు చేసిన దృశ్యాలు ఇంకా కండ్ల ముందే ఉన్నాయన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో వేల కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు, తాగునీటి కష్టాలు తీరాయన్నారు. ఎండకాలంలో కూడా మానేరు డ్యాం నిండు కుండను తలపిస్తోందని పేర్కొన్నారు.
నగరంలో రోజూ తాగునీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టి దోచుకునేందుకు ఆంధ్రా నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి అధికారం కట్టబెడితే మళ్లీ ఇకడి యువత ఉపాధి లేక ముంబై, దుబాయ్, భీవండి ప్రాంతాలకు వలస పోయే రోజులు వస్తాయన్నారు. ఎలాగైనా కేసీఆర్ను ఓడించి పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు ఆంధ్రోళ్లు హైదరాబాద్లో అడ్డా వేశారని విమర్శించారు. హైదరాబాద్లోని సినిమా స్టూడియోలు చూపించి అక్కడి సంపదను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ను ఓడించేందుకు ఢిల్లీ పార్టీలను మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టాలని ప్రశ్నించారు.? తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు ఓడించాలా అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారమిస్తే తెలంగాణ మళ్లీ గుడ్డిదీపం అవుతుందన్నారు. వారికి అధికారమిచ్చి మన భవిష్యత్ తరాల నోట్లో మన్ను కొట్టొద్దని సూచించారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందన్నారు. మన తాతలు తప్పు చేస్తే 50 సంవత్సరాలు అరిగోసపడ్డామని, ఇప్పుడు మనం తప్పుచేస్తే మన భవిష్యత్ తరాలు గోస పడుతాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తున్నాయని చెప్పారు.
పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గంగులకు ఓటు వేస్తే కేసీఆర్కు వేసినట్టేనని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే కరీంనగర్ను గొప్పగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశామని, రాత్రిళ్లు నగరం జిగేలుమంటుందన్నారు. రౌడీషీట్ ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. సర్పంచ్గా ఉంటేనే పదుల సంఖ్యలో కేసులున్నాయని, ఇక ఎమ్మెల్యే అయితే వందల కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఎప్పుడైనా ప్రజలకు కనిపించారా అని ప్రశ్నించారు.
ఇప్పుడు ఎన్నికల పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నగరంలో తాను బ్రహ్మోత్సవాలు నిర్వహించానని, ఇప్పుడు టీటీడీ ఆలయం, ఇసాన్ టెంపుల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ అంటే ఆధ్యాత్మికత, ఆహ్లాదం, అభివృద్ధి అన్న విధంగా ముందుకు సాగుతుందన్నారు. కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు భేషుగా ఉన్నాయని తెలిపారు. మతఘర్షణలు కావాలా ప్రశాంతమైన కరీంనగర్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్దేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిపై చర్చ పెట్టి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీదేవి, ఇఫ్రాన్, నాయకులు పెద్దపల్లి రవీందర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.