కలెక్టరేట్, డిసెంబర్ 23: విడిపోయి సుభిక్షంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజలను కాటేసేందుకు కాలనాగులు బుసకొడుతున్నాయ్.. కలిసికట్టుగా ఉండి వాటిని తరిమికొట్టేందుకు తెలంగాణ వాసులంతా మరోసారి ఏకం కావాలని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. నగరంలో టీఎన్జీవోల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, సీమాంధ్ర పాలకుల నుంచి విముక్తి పొందిన తెలంగాణ రాష్ర్టాన్ని కబలించేందుకు జరుగుతున్న కుట్రలను చేధించి, కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ఉద్యోగులదేనని పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలు, కపట నాటకాలతో ప్రజలను విడదీసి తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు సమాయత్తం కావాలన్నారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజల బాధలు వర్ణనాతీతం కాగా, ఏడేళ్లలో ఏ ఒక్కనాడు రాష్ట్ర ప్రజలు సమస్యలు ఎదుర్కోలేదని, అయినా సీమాంధ్ర నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్యోగులంతా సంఘటితంగా ఉంటే వారి పప్పులుడకవన్నారు. స్వరాష్ట్రంలోనే ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన జీత భత్యాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని, పెండింగ్లో ఉన్న మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాత పెన్షన్ విధానం అమలు బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారు కూడా రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక ఉద్యమంతో రాష్ట్రం విడిచి పారిపోయిన వారంతా తెలంగాణలో తిష్టవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం ఉద్యమించింది మనమైతే, రాజకీయ ఉపాధి కోసం వాళ్లు మళ్లీ వస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు, షర్మిల, పవన్కళ్యాణ్ ప్రజలను మోసం చేసేందుకు తెలంగాణ బాట పట్టారని ధ్వజమెత్తారు. అనంతరం టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో మంత్రులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, కే శ్రీనివాస్రెడ్డి, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పొన్నం అనిల్కుమార్, నర్సింహస్వామి, గాజుల నర్సయ్య, కోట రామస్వామి, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టీఎన్జీవోల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.