Collector Koya Sriharsha | రామగిరి, సెప్టెంబర్ 18 : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రామగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. రామగిరి మండలంలో 12,467 ఎకరాల్లో పంటలు సాగు చేసిన నేపథ్యంలో రైతులకు వ్యవసాయ సేవలు సకాలంలో అందించాలని, ఎరువుల విక్రయాలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. 52.63 శాతం పూర్తైన డిజిటల్ క్రాప్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెంచడంతో పాటు ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని, మైక్రో ఇరిగేషన్పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనాథ్, డిప్యూటీ సీఈవో సంజీవరావు, డీఎల్పీవో కొమురయ్య, ఎంపీడీవో శైలజారాణి తదితరులు పాల్గొన్నారు.