స్వశక్తి సంఘాలకు రుణాల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లు సైతం అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమవుతున్నారు. సర్కారు సూచనల మేరకు లక్ష్య సాధనకు చకచకా అడుగులు వేస్తున్నారు.
– కలెక్టరేట్, డిసెంబర్ 10
కలెక్టరేట్, డిసెంబర్ 10: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరుప్రక్రియకు తాత్కాలింగా బ్రేక్ పడ్డది. కొన్ని నెలలుగా గ్రామీణాభివృద్ధిశాఖాధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో రుణాల పంపిణీలో ఆలస్యం జరిగింది. ఎన్నికలు ముగియడంతో స్వశక్తి సంఘాలకు రుణాలివ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బ్యాంకర్లు కూడా తమకు నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేసి, కొత్త ఆర్థిక సంవత్సరానికి అంచనాలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు మాసాలుగా సాధారణ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న అధికార యంత్రాంగం, త్వరలో పంచాయతీ, అనంతరం సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగే అవకాశాలుండడం, ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం కూడా సమీపిస్తుండగా, ఈలోపే లక్ష్యం పూర్తి చేయాలంటూ గ్రామీణాభివృద్ధిశాఖ బ్యాంకర్లను కోరింది.
దీంతో, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న సంఘాలకు శరవేగంగా రుణాలు మంజూరు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 849 గ్రామైక్య సంఘాలుండగా, వీటి పరిధిలో 22,300 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 2,47,726 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే కావడంతో వీరి కుటుంబాల ఆర్ధికాభివృద్ధి కోసం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో రూ.92 కోట్ల 64లక్షల 84వేలు రుణంగా అందించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు 351గ్రామైక్య సంఘాల పరిధిలో1951 స్వయం సహాయక సంఘాల్లోని 4855 మంది సభ్యులకు రూ.39 కోట్ల 8లక్షల 49వేల రుణ పంపిణీ చేశారు.
సంఘాల అర్హత, వారు చెల్లించే క్రమాన్ని బట్టి సాయం పెంచుతూ, బ్యాంకు లింకేజీ రుణాన్ని సంఘాల ఖాతాల్లో జమచేస్తారు. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకర్లు రుణాలు విడుదల చేస్తుంటారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల నుంచే రుణ పంపిణీ ప్రారంభించినా, స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో ఎక్కువ మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో, రుణాలు పొందడంలో కొంతమేర జాప్యం కలిగింది. ఈలోపే అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ రావడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తింపజేయడం, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంతో మిగిలిన సంఘాలకు రుణాల పంపిణీ నిలిచింది.
ప్రస్తుతం ఎన్నికలు ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో నెల రోజుల్లో పంచాయతీ పోరు ప్రారంభమయ్యే అవకాశాలుండగా, ఈలోపే రుణ లక్ష్యం పూర్తి చేసేందుకు స్త్రీనిధి అధికారులు పరుగులు తీస్తున్నారు. గ్రామాల్లోని ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రుణాలు పొందిన వారిని చెల్లింపులపై దృష్టి సారించేలా, ఇంకా రుణాలు అందాల్సిన వారిని వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. జనవరి నెలాఖరు వరకే నిర్దేశించిన మేరకు రుణ లక్ష్యం పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రుణ లక్ష్యం కొత్త ఏడాది ఫస్ట్ నెలలోనే చేరుకునేందుకు కృషి చేస్తున్నాం. ఆర్ధిక సంవత్సరం ముగిసేందుకు మూడు నెలల గడువు ఉన్నది. అయితే, పంచాయతీ, అనంతరం పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశాలుండగా, వచ్చే నెలలోనే లక్ష్యం చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రతి మండలంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే తమ సిబ్బందిని ఆదేశించాం. సక్రమంగా తిరిగి చెల్లించేవారికి, మరింత అదనంగా అందజేసేలా బ్యాంకర్లకు సూచనలు చేస్తున్నాం.
– ఎల్.శ్రీలత, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి