ఉమ్మడి జిల్లాలో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు ప్రభంజనం కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఓటర్ల సంఖ్య పెరిగింది. బుధవారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం చూస్తే ఎన్నికకూ ఎన్నికకు మధ్య అత్యధిక పెరుగుదల ఇదేనని స్పష్టమవుతున్నది. 2018 ఎన్నికల సమయంలో 27,87,549 మంది ఓటర్లుండగా, ఇప్పుడా సంఖ్య 31,12,283కు చేరింది. అప్పటికీ ఇప్పటికీ కొత్తగా 3,24,734 ఓట్లు పెరగ్గా, అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 55వేలకుపైగా నమోదైనట్లు తేలింది. కరీంనగర్, రామగుండం మినహా మిగిలిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు యంత్రాగం ప్రకటించింది.
కరీంనగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి (నమస్తే తెలంగాణ): చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు నమోదుపై ఉమ్మడి జిల్లా పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కనిపించింది. అంచనాలకు మించి 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లుగా ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే అర్థం మవుతున్నది. నిజానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఏడాది కాలంగా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు ఊరూవాడా తేడా లేకుండా ప్రత్యేక చాటింపు వేయించారు. దీంతోపాటు బూత్లెవల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ.. ఓటరు జాబితాను ప్రచురిస్తూ.. గ్రామాల్లో చైతన్యం కల్పించారు. ఒక్కో బూత్కు ఒక్కో ఇన్చార్జిని నియమించి.. ఆ బూత్ పరిధిలో కొత్తగా నమోదైన వివరాలు, అలాగే తొలగించిన వివరాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. దీంతో క్షేత్రస్థాయి అధికార యంత్రాగం పరిపూర్ణంగా పనిచేసింది. ఫలితంగా ఓటర్ల సంఖ్య అనుహ్యంగా పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొత్తగా 3.24 లక్షలకుపైగా ఓటర్లు
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి 3,24,734 మంది ఓటర్లు పెరిగారు. నిజానికి గత జనవరిలోనే ఓటరు జాబితా విడుదల చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలో అప్పటికి 1,85,496 ఓటర్లు కొత్తగా పెరిగారు. అప్పుడే రాజకీయ పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేయగా, యంత్రాంగం నివృత్తి చేసింది. ఆ తదుపరి గతనెల 19 వరకు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దీనిపై అన్ని జిల్లాల్లోనూ విసృత స్థాయి ప్రచారం చేసింది. గత నెల 19 నాటికి 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 1,37,646 దరఖాస్తులు వచ్చా యి. వీటన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించిన యం త్రాగం.. బుధవారం చివరి జాబితా విడుదల చే సింది. కొత్త జాబితా ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3,24,734 ఓట్లు పెరిగాయి. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం లో ఓట్లు పెరిగిన దాఖలాలు లేవు. కాగా, ఈసారి రామగుండం, కరీంనగర్ మినహా 11 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నది.
నాడు తగ్గి.. నేడు లక్షల్లో పెరిగి
నిజానికి గతంలోనూ ఓటు హక్కు క ల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా చైతన్యం కనిపించలేదు. దీని కి నిదర్శనమే 2018 ఎన్నికలే. 2014తో పోలిస్తే 2018 ఎన్నికల సమయం నాటికి ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ, అలా జరగలేదు. 2014 ఎన్నికల సమయంలో ఉ మ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 28,27,556 ఓటర్లు ఉం డగా, 2018 ఎన్నికల సమయానికి ఆ సంఖ్య 27,87,549కి తగ్గింది. అంటే ఈ రెండు ఎన్నికల మధ్య 40,007 మం ది ఓటర్లు తగ్గారు. కానీ, ప్రస్తుతం 2018 ఎన్నికలు, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నిలకు మధ్య మాత్రం 3,24,734 ఓటరుఉ్ల పెరడాన్ని చూస్తే చైతన్యం వెల్లివిరిసినట్లు కనిపిస్తున్నది. ఏ కోణంలోచూసిన ఉమ్మడి జిల్లాలో ఈ సారి ఓటరు ప్రంభజనం కనిపించనున్నది.