పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే మొదలు కాబోతున్నది. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ రానుండగా, ఆ వెంటే దరఖాస్తుల ప్రక్రియ షురూ కానున్నది. సెలవు రోజులు మినహా ఈ నెల 25 దాకా ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా స్వీకరించనుండగా, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికల యంత్రాంగం ఆయా కలెక్టరేట్లలో అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నామినేషన్ల సమయంలో అభ్యర్థులు, వారిని బలపరిచే వారు మినహా ఇతరులెవ్వరిని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనికి అనుమతించవద్దని ఈసీ స్పష్టం చేస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్/పెద్దపల్లి, ఏప్రిల్ 17: పార్లమెంట్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఆ వెంటే నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా, ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. కరీంనగర్ పార్లమెంట్కు సంబంధించి కరీంనగర్ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో.. పెద్దపల్లి లోక్సభకు సంబంధించి పెద్దపల్లి కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
కలెక్టరేట్ గేట్ నుంచి రిటర్నింగ్ అధికారి చాంబర్ వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా కలెక్టరేట్ గేట్ వద్ద షామియానాలు, టెంట్లు వేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను కేటాయించారు. నామినేషన్ సమయంలో సమర్పించాల్సిన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయం కోసం నామినేషన్ దాఖలుకు ఒకరోజు ముందే జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలని, నామినేషన్ పత్రాల పరిశీలనకు ముందే అఫిడవిట్ కరెక్షన్లు, డిపాజిట్ సొమ్ము, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని సూచిస్తున్నారు.
అభ్యర్థులు తమ నామినేషన్లు సజావుగా దాఖలు చేసేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల ఎదుట సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థితోపాటు ఆయనను బలపరిచే ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనికి అనుమతిస్తారని, అలాగే మూడు వాహనాలకు మాత్రమే లోపలికి పర్మిషన్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మిగతా వారంతా వంద మీటర్ల దూరంలో ఉండాలని సూచిస్తున్నారు.
నామినేషన్ల సందర్భంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే తప్పనిసరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, కరపత్రాల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 127ఏ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. నామినేషన్ల సమయంలో సాధారణ ప్రజలను కూడా కలెక్టరేట్లోకి అనుమతించ కూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు. నామినేషన్ వేసిన నాటి నుంచే అభ్యర్థుల ఖర్చుల లెక్కింపు మొదలవుతుందని, 95లక్షలకు మించి ఖర్చు చేయవద్దని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంటున్నారు. అభ్యర్థులు తాము చేస్తున్న ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ, బిల్లులతో సహా జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించాలని, పరిమితిని మించితే వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణతోపాటు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు సూచించారు. ఒక్కో అభ్యర్తి 95లక్షలకు మించి ఖర్చు చేయవద్దని చెప్పారు.
– కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి