కరీంనగర్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కలెక్టరేట్ : పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన మొదటి అంకం రేపటి నుంచే మొదలు కాబోతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది. ఆ వెంటే నామినేషన్ల పర్వం ప్రారంభమై వారం పాటు కొనసాగనున్నది. ఈ నెల 25తో స్వీకరణ గడువు ముగియనుండగా, ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఇప్పటికే డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఇటు ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రచారానికి సంబంధించి ఎలాంటి అనుమతులైనా సువిధ యాప్ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి తీసుకోవాలని సూచిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రానుండగా, అందుకు అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కరీంనగర్, పెద్దపల్లి రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 33,82,724 మంది ఓటర్లు ఉండగా.. 4,050 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఓటర్లకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కోసం 14,100 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగించనున్నారు.
వంద శాతం ఓటింగ్ లక్ష్యం
వందశాతం వోటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం కృషి చేస్తున్నది. అందులో భాగంగా 85 ఏండ్లు నిండిన వయోవృద్ధులతోపాటు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. వీరిలో అర్హులైన వారికి ఫామ్-12 ఫారాలు అందించి, హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తులు కూడా చేయించింది. మే 3 నుంచి వారికి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
లెక్కలు తప్పని సరి
నామినేషన్లు వేసిన నాటి నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు పరిగణలోకి వస్తాయి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కలు కచ్చితంగా చూపాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులను అంచనా వేసేందుకు ఈసీ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఫ్లయింగ్ స్వాడ్, స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్, వీడియో సర్వైలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎంసీసీ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నాయి.
పెద్దపల్లి కలెక్టరేట్లో..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల ప్రకియను కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తన చాంబర్లో అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించనున్నారు. అభ్యర్థులు కలెక్టరేట్లోని ఎస్బీఐ పక్కన ఉన్న ప్రవేశ ద్వారం గుండా రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలతోపాటు జగిత్యాల జిల్లాలో విస్తరించి ఉండగా, అందుకనుగుణంగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇతర జిల్లాల్లోని అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించారు. పెద్దపల్లికి ఆర్డీవో గంగయ్య, రామగుండానికి అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మంథనికి ఆర్డీవో హనుమనాయక్, మంచిర్యాలకు ఆర్డీవో రాములు, చెన్నూర్కు ఎస్డీసీ చంద్రకళ, బెల్లంపల్లికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్, ధర్మపురికి అదనపు కలెక్టర్ దివాకర ఏఆర్వోలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నోడల్ అధికారులను కూడా నియమించి, 6,500 మందికి పైగా ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించారు. వీరిలో పీవోలు, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఓపీవోలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15,94,332 మంది ఓటర్లుండగా, దాదాపు 1,850 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్లో
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ చాంబర్లో అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించనున్నారు. అభ్యర్థులు కలెక్టరేట్లోని ప్రధాన ద్వారం గుండా రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో విస్తరించి ఉండగా, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తున్నారు. అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇతర జిల్లాల్లోని అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వో)ను కూడా నియమించారు. కరీంనగర్కు కే మహేశ్వర్, చొప్పదండి ప్రపుల్ దేశాయ్, వేములవాడకు ఎస్ రాజేశ్వర్, సిరిసిల్లకు పీ గౌతమి, మానకొండూర్కు కే లక్ష్మీకిరణ్, హుజూరాబాద్కు ఎస్ రమేశ్, హుస్నాబాద్కు వీ రామ్మూర్తి ఏఆర్వోలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటు నోడల్ అధికారులను కూడా నియమించి, 7,600కు పైగా ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించారు. వీరిలో పీవోలు, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఓపీవోలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 17,88,392 మంది ఓటర్లుండగా, దాదాపు 2,200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.